అక్బరుద్దీన్ కొడంగల్ లో పోటీ చేస్తే డిపాజిట్‌ కూడా రాకుండా చేస్తం: బండి సంజయ్‌

అక్బరుద్దీన్ కొడంగల్ లో  పోటీ చేస్తే డిపాజిట్‌ కూడా రాకుండా చేస్తం: బండి సంజయ్‌

ఎంఐఎం పార్టీపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తీరు చూ గోడమీది పిల్లిలాంటిదని అన్నారు. గోడమీది పిల్లి లాగే ఎవరు అధికారంలో ఉంటే వారి చెంతకు చేరుతుందని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ తో మామ.. మామ అంటూ అంటకాగి అధికారం పోగానే వారితో సంబంధాలు తెంపేసుకుందన్నారు.  పాతబస్తీ లాల్‌దర్వాజ బోనాల సందర్భంగా చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 

అనంతరం మాట్లాడుతూ.. కొత్తగా సీఎం రేవంత్‌ రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ అన్నదమ్ములయ్యారన్నారని.. ఆ బంధానికి గుర్తుగా అక్బరుద్దీన్‌ను డిప్యూటీ సీఎం చేస్తా అని రేవంత్‌ రెడ్డి అంటున్నారని తెలిపారు. అక్బరుద్దీన్‌ కు  దమ్ముంటే  కొడంగల్‌ నుంచి పోటీచేయాలని సవాల్ విసిరారు. కొడంగల్ లో అక్బరుద్దీన్ పోటీ చేస్తే డిపాజిట్‌ కూడా రాకుండా చేస్తామన్నారు. కొన్ని ప్రాంతాల్లో బోనాలను అడ్డుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు.  

ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలని హితవు పలికారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్‌ టెంపుల్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. తాను హిందువుల తరపున పక్కా మాట్లాడుతానని... అంతే తప్పా ఇతర మతాలకు వ్యతిరేకం కాదన్నారు.