- సీఎస్ చైర్మన్గా రాష్ట్ర స్టీరింగ్ కమిటీ.. కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి
- నోడల్ డిపార్ట్ మెంట్గా ఇరిగేషన్ శాఖ.. ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు: ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్వై) పథకంలో భాగంగా ఆయకట్టు అభివృద్ధి, నీటి నిర్వహణ సబ్ స్కీమ్ ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నోడల్ డిపార్ట్మెంట్, రాష్ట్ర, జిల్లాస్థాయిలో స్టీరింగ్ కమిటీలను నియమించింది. ఈ మేరకు సోమవారం సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం క్యాడ్వామ్ స్కీమ్ను అమలు చేయాలని, ప్రధానంగా హార్టికల్చర్, అగ్రికల్చర్, సాగునీటివనరుల ప్రాజెక్టులను పైలట్ ప్రాజెక్టులుగా చేపట్టాలని గత ఏప్రిల్లో నిర్ణయించింది.
అందుకోసం రాష్ట్ర, జిల్లా కమిటీలను, నోడల్ డిపార్ట్మెంట్ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను నియమించింది. స్కీమ్ అమలు కోసం ఇరిగేషన్శాఖను నోడల్ డిపార్ట్మెంట్గా, ఇంప్లిమెంటేషన్ అధికారిగా క్యాచ్మెంట్ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా) సీఈ, నోడల్ ఆఫీసర్గా కాడా ఎస్ఈని నియమించింది. ఇక స్కీమ్కు సంబంధించి ప్రణాళికల రూపకల్పన, ప్రాజెక్టుల ఎంపిక తదితర వాటికోసం స్టేట్లెవల్ స్టీరింగ్ కమిటీని, జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీలను నియమించింది.
స్టేట్ లెవల్ కమిటీకి సీఎస్ చైర్మన్గా, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మెంబర్ సెక్రటరీగా, అగ్రికల్చర్, అటవీ, ఫైనాన్స్, ప్లానింగ్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, స్టాటిస్టిక్స్ తదితర శాఖల ఉన్నతాధికారులు మెంబర్లుగా ఉండనున్నారు. ఇక జిల్లాస్థాయి కమిటీకి కలెక్టర్ చైర్మన్గా, కాడా ఎస్ఈ మెంబర్సెక్రటరీగా, ఆయా శాఖల జిల్లాస్థాయి అధికారులు మెంబర్లుగా వ్యవహరించనున్నారు. కమిటీలు రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో స్కీమ్ మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టుల ఎంపిక తదితర అంశాలను పరిశీలించనున్నారు.
