మేము మంచి కోరితే.. ‘ఎర్రబెల్లి’ చెడు చేసిండు.. మీడియా చిట్‍చాట్లో హనుమాండ్ల ఝాన్సీ కామెంట్స్

మేము మంచి కోరితే.. ‘ఎర్రబెల్లి’ చెడు చేసిండు.. మీడియా చిట్‍చాట్లో హనుమాండ్ల  ఝాన్సీ కామెంట్స్

వరంగల్‍, వెలుగు: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు పాలకుర్తి సెగ్మెంట్ ను వదిలి వర్ధన్నపేటకు పోతున్నాడని కాంగ్రెస్‍ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, పాలకుర్తి సెగ్మెంట్ ఇన్ చార్జ్ హనుమాండ్ల ఝాన్సీ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో రెండు చోట్ల ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, తను పోటీకి సిద్ధమని  స్పష్టంచేశారు. గురువారం హనుమకొండలోని అశోక కాన్ఫరెన్స్ హాల్‍లో ఆమె మీడియాతో చిట్‍చాట్‍ నిర్వహించారు. 

ఖమ్మం జిల్లా మధిరలో తమది రాజకీయ  కుటుంబమని చెప్పారు. అయినా.. రాజకీయాల వైపు వెళ్లకుండా అమెరికాలో ఉంటూ 45 ఏండ్లుగా వరంగల్ జిల్లాలో  పేదల కోసం  కోట్లాది రూపాయలతో స్కూళ్లు, ఆస్పత్రులు, లైబ్రరీలు కట్టించి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. తమను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించినా రాలేదని.. కానీ, దయాకర్ రావు తీరువల్లే రావాల్సి వచ్చిందన్నారు. 

పాలకుర్తి అభివృద్ధికి తోడు ఎర్రబెల్లికి అన్నివిధాలా సహకరిస్తే కుట్రలు చేశాడని,ఏండ్లపాటు ఎన్నో ఇబ్బందులు పెట్టాడని ఆమె ఆరోపించారు.   కాంగ్రెస్ అధినేత రాహుల్‍గాంధీ, పీసీసీ చీఫ్ రేవంత్‍రెడ్డి తమను రాజకీయాల్లోకి వచ్చేలా ఒప్పించినట్లు పేర్కొన్నారు.  పాలకుర్తిలో ఎమ్మెల్యే బరిలో ఉంటానని తెలిసి.. తనను సిటిజన్ షిప్ పేరుతో పోటీ చేయకుండా ఎర్రబెల్లి అడ్డుకుని కుట్రలు చేశాడని మండిపడ్డారు. 

తిరిగి అమెరికా వెళ్లిపోతానని ఆనందపడ్డాడని, కానీ తమ కోడలు యశస్విని రెడ్డి దింపి ఎన్నికల్లో ఎర్రబెల్లిని ఓడించామన్నారు. అతనికి ఓటర్లు సరైన బుద్ధి చెప్పారన్నారు. ఇప్పటికీ తమ కుటుంబంపై దయాకర్ రావు కుట్రలు ఆపలేదని.. సోషల్‍ మీడియాలో ఫేక్‍ ప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. తమను నమ్ముకున్న ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధికి పాలకుర్తిలోనే ఉంటామని ఆమె స్పష్టం చేశారు.