హైదరాబాద్,వెలుగు : శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇండ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుందని వెల్లడించారు.
బస్ భవన్లో సోమవారం భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. అలాగే తలంబ్రాల బుకింగ్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ‘‘అత్యంత నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏండ్లుగా రాములోరి కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని రెండేళ్ల క్రితమే సంస్థ నిర్ణయించింది. సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకుంటున్నారు. 2022లో దాదాపు 89 వేల మంది బుక్ చేసుకున్నారు. గత ఏడాది 1.17 లక్షల మందికి తలంబ్రాలు అందజేశాం’’ అని సజ్జనార్ తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు ఆర్టీసీ కాల్ సెంటర్ 040-2345 0033, 040- 6944 0000, 040 -6944 0069 నంబర్లను సంప్రదించాలని సూచించారు.