న్యూఢిల్లీ: టాటా గ్రూప్ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సీఎల్) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పునీత్ ఛత్వాల్ వార్షిక వేతనం (రెమ్యునరేషన్) 2025–26లో దాదాపు 9 శాతం పెరిగి రూ.25 కోట్లకు చేరింది. 2024–-25 లో ఆయన వేతనం రూ.23 కోట్లుగా ఉంది. ఈ రూ.25 కోట్లలో రూ.14.21 కోట్లు బేసిక్ శాలరీ, పెర్ఫార్మెన్స్ బోనస్ కాగా, రూ.4.84 కోట్లు అలవెన్సులు, రూ.5.95 కోట్లు కమిషన్ రూపంలో లభించాయి.
కంపెనీలోని సగటు ఉద్యోగి జీతంతో పోలిస్తే సీఈఓ వేతనం 521.7 రెట్లు ఎక్కువగా ఉంది. గతేడాది కంపెనీ ఉద్యోగుల సగటు జీతం 5.5శాతం పెరిగింది. కిందటి నెల 30న జరిగిన ఏజీఎంలో ఛత్వాల్ గరిష్ట బేసిక్ శాలరీని నెలకు రూ.22 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచుతూ వాటాదారులు ఆమోదం తెలిపారు. ఈ సవరణ ఏప్రిల్ 1, 2026 నుంచి ఆయన పదవీకాలం ముగిసే (నవంబర్ 5, 2027) వరకు వర్తిస్తుంది.
