
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా చాలా రోజుల తర్వాత సంగీతం అందించిన చిత్రం ‘షష్టిపూర్తి’. రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ హీరోగా నిర్మాతగా రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ ‘నా కెరీర్ ప్రారంభం నుంచి కూడా కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాను. భారతీరాజా, మణిరత్నం ఇలా అందరూ అప్పట్లో కొత్త వాళ్లే. నాతో సినిమాలు చేసిన తర్వాత వారికి స్టార్డమ్, మంచి గుర్తింపు వచ్చాయి. వాళ్లని వాళ్లు నిరూపించుకుని ఆ స్థాయికి వెళ్లారు.
అలా కొత్తగా వచ్చేవారిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ‘షష్టిపూర్తి’ని ఒప్పుకున్నా. మంచి కథ ఉందా లేదా అనేది మాత్రమే నేను చూస్తాను. ఇందులో నేను చేసిన పని ఎలా ఉంది అనేది ఆడియెన్స్ చెప్పాలి. ఈ కథను పవన్ ప్రభ చాలా అందంగా చూపించారు. ఇదొక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న స్టోరీ. ఓ పాటకు కీరవాణి అందించిన లిరిక్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. కచ్చితంగా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చే చిత్రంగా ‘షష్టిపూర్తి’ నిలుస్తుంది’ అని అన్నారు.