చేపల చెరువుల కోసం నీళ్ల మళ్లింపు
రైతుల పొలాల నుంచి పిల్ల కాల్వ నిర్మాణం
పరిహారం ఇవ్వకుండానే పనులు
సిద్దిపేట, వెలుగు: మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఫామ్ హౌజ్కు నీటిని మళ్లించడం వివాదాస్పదంగా మారుతోంది. రూల్స్ను ఖాతరు చేయకుండా పవర్ను మిస్యూజ్చేస్తూ కెనాల్నిర్మాణాన్ని చేపట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే ఆరుగురు రైతులకు చెందిన 30 గుంటల భూమిలో ఈ కెనాల్తవ్వారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం దగ్గరున్న అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి వచ్చే డీ–7 కెనాల్ను కొంతమేరకు తవ్వేసి అక్కడి నుంచి అర కిలోమీటరు దూరంలో ఉన్న ఎమ్మెల్యే ఫామ్హౌజ్లోని చేపల చెరువులోకి నీటిని మళ్లించారు.
పరిహారం ఇవ్వకుండానే..
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 10 కింద ఎండీఎల్7 లో మూడు మీడియం డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, మరో మూడు పిల్లకాల్వల నిర్మాణానికి 19 మంది రైతుల నుంచి 7.11 ఎకరాల భూసేకరణ జరపనున్నట్టు గత ఏడాది జూలైలో పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి , ఆహార భద్రత నుంచి మినహాయింపు ఇస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ కాల్వల అలైన్మెంట్ మాత్రం ప్రకటించలేదు. మూడు నెలల కింద గుండారం దగ్గర ఆఫీసర్లు నీటి మల్లింపు పనులు ప్రారంభించి.. అర కిలో మీటరు దూరంలోని ఎమ్మెల్యే ఫామ్ హౌజ్ వరకు మాత్రమే హడావుడిగా పిల్ల కాల్వను తవ్వి వదిలి వేశారు. మిగతా కాల్వల సంగతి పట్టించుకోకుండా ఈ ఒక్క పనే చేయడం అనుమానాలకు తావిస్తోంది. భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి రైతులకు పరిహారాలు అందించిన తరువాత వారి పొలాల నుంచి కెనాల్ తవ్వడం ప్రారంభించాల్సి వున్నా ఈ రూల్ పట్టించుకోలేదు.
చేపల చెరువు కోసమే..
గుండారం వద్ద ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తమ ఫామ్ హౌజ్ లో నిర్మిస్తున్న నాలుగు చేపల చెరువుల కోసమే పిల్ల కాల్వ ద్వారా నీటిని మళ్లించుకుంటున్నట్టు తెలుస్తోంది. రాబోయే కాలం నీటి అవసరాలకోసం ఎమ్మెల్యే ఇప్పుడే జాగ్రత్త పడ్డట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ కాల్వ కోసం భూములు కోల్పోయిన రైతులు మాత్రం రూలింగ్ పార్టీ లీడర్ల ఒత్తిడి వల్ల నోరు మెదపడంలేదని తెలుస్తోంది. వారికి పరిహారం ఎంత వస్తుందో.. ఏలెక్కన ఇస్తారో కూడా తెలియదని అంటున్నారు.
పవర్ మిస్యూజ్చేశారు..
ఫామ్ హౌజ్ కు నీటిని తరలించుకునేందుకే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. ఆఫీసర్లు కూడా ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతూ యమ స్పీడ్గా కాల్వను తవ్వి వదిలిపెట్టారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి -జి.అశోక్, బీజేపీ మండల ప్రెసిడెంట్, బెజ్జంకి
నోటిఫికేషన్ మేరకే భూసేకరణ
గత ఏడాదిలో గుండారంలో భూ సేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే పనులు నిర్వహిస్తున్నాం. ఇందుకు సంబంధించి అవార్డు ప్రక్రియ పూర్తి కావాల్సి వుంది. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో డీ7 కాల్వ నుంచి ఎమ్మెల్యే సూచన మేరకు ఫామ్ హౌజ్ వరకు పిల్ల కాల్వను నిర్మించాం. పిల్ల కాల్వను నిర్మించిన స్థలంలోని రైతులకు పరిహారాలు అందాయాలేదా అన్నది నాకు తెలియదు. – నాగేశ్వరరావు, ఇరిగేషన్ ఏఈ, బెజ్జంకి
ఇవీ చదవండి
పోషక విలువలున్నాయని ఎక్కువగా తింటే..
జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్: సామియా @ వరల్డ్ నెంబర్-2
నెట్ బౌలర్గా వెళ్లి 3 ఫార్మాట్లలో అరంగేట్రం