
పద్మారావునగర్, వెలుగు: తిరుమలగిరిలో ఆర్మీ అధీనంలో ఉన్న ప్రాంతంలోకి అక్రమంగా చొరబడిన నలుగురు వ్యక్తులను తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరిలోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ కాలేజీ టెక్నో చౌక్ గేటులోకి శుక్రవారం నలుగురు వ్యక్తులు ఎంటర్ అయ్యారు. ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు నకిలీ వైమానికదళ అధికారి గుర్తింపు కార్డులు, ఎయిర్ ఫోర్సు దుస్తులతో లోపలికి ప్రవేశించారు.
ఆర్మీ రహస్య ప్రాంతంలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు. ఆర్మీ ప్రాంతంలోని కీలక సమాచారాన్ని ఫొటోలు, వీడియోలు తీసుకోవడంతో ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లో విచారించి తిరుమలగిరి పోలీసులకు అప్పగించారు. లెఫ్టినెంట్ కల్నల్ ఫిర్యాదుతో తిరుమలగిరి పీఎస్లో కేసు నమోదైంది. వీరు ఆర్మీ క్యాంటిన్లలో పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. జాతీయ భద్రతా అంశం కావడంతో లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. రాకేష్ కుమార్, ఆశిష్ కుమార్, ఆలియా అబ్షీ, నగ్మభాను పోలీసుల అదుపులో ఉన్నారు.