కేటీఆర్ ఆధ్వర్యంలో ఖాదీ బోర్డ్ భూమి అక్రమ రిజిస్ట్రేషన్

కేటీఆర్ ఆధ్వర్యంలో ఖాదీ బోర్డ్ భూమి అక్రమ రిజిస్ట్రేషన్

జగిత్యాల జిల్లా మెట్పల్లి ఖాదీ ప్రతిష్ఠాన్ బోర్డ్  భూమిని అక్రమంగా కొడిమ్యాల మండలంలోని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే, బీజేపి నేత బొడిగెశోభ. నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆమె.. స్థానిక పద్మశాలీలకు మేలు కలిగే విధంగా బీజేపీ పక్షాన న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. సంబంధిత ఖాదీ శాఖ మంత్రి కేటీఆర్ కు తెలిసే.. ఆయన కనుసన్నల్లోనే ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు.

ఖాదీ బోర్డు కార్మికుల పొట్ట కొట్టకుండా వెంటనే అక్రమ రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని బొడిగెశోభ డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని చేనేత కార్మికులపై చూపించిన ప్రేమను.. కేటీఆర్ పూడూరులో ఉన్న  పద్మశాలీలపై కూడా చూపించాలన్నారు. లేదంటే రాబోవు రోజుల్లో చేనేత కార్మికులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బొడిగెశోభ మెట్పల్లి పర్యటన కారణంగా ముందస్తుగా ఖాదీ బోర్డ్  బిల్డింగ్ కు అధికార పార్టీ నేతలు తాళం వేశారు. అంతేకాదు.. ఎలాంటి ఆందోళనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు.