- ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్లో అక్రమంగా పిల్లల రవాణా
- 25 మంది చిన్నారులను కాపాడిన పోలీసులు
- 10 మంది దళారుల అరెస్ట్
సికింద్రాబాద్, వెలుగు: వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 25 మంది పిల్లలను ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తుండగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, బచ్పన్ బచావో ఆర్గనైజేషన్ ‘చైల్డ్ లైన్’ వలంటీర్లు మంగళవారం వారిని కాపాడారు. అక్రమంగా తరలిస్తున్న పది మంది దళారులను పోలీసులు అరెస్టు చేశారు.
నగరంలోని పలు పారిశ్రామిక సంస్థల్లో పనులు చేయించేందుకు వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పిల్లలను సికింద్రాబాద్కు తీసుకువస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వచ్చిన ఈస్ట్కోస్ట్ఎక్స్ప్రెస్లో తనిఖీలు చేసి 25 మందిని కాపాడారు.
వారిని తరలిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను షెల్టర్హోమ్కు తరలించారు. విచారణ అనంతరం వారిని తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.