న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలాంటి గంభీరమైన వ్యక్తి.. కెప్టెన్సీ పంచుకోవడానికి ఇష్టపడడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. ఈ విధానం పట్ల కోహ్లీ అంత అనుకూలత చూపడని స్పష్టం చేశాడు. అలాగే, కెప్టెన్సీ షేరింగ్ కాన్సెప్ట్ కూడా ఇండియా క్రికెట్కు పనికిరాదన్నాడు. ‘మనిషి క్యారెక్టర్ మీద కెప్టెన్సీ షేరింగ్ ఆధారపడి ఉంటుంది. కోహ్లీ చాలా గంభీరంగా కనిపిస్తుంటాడు. అందుకే మరొకరితో కెప్టెన్సీని పంచుకోలేడు. అతనికి ఇది చాలా కష్టమైన పని. దేనినైనా వేరేవాళ్లకు వదులుకోవడానికి ఇష్టపడడు. మా దగ్గర మోర్గాన్, రూట్ కెప్టెన్లుగా పని చేస్తున్నారు. వీళ్లిద్దరిది సర్దుకుపోయే క్యారెక్టర్. వాళ్ల పరిధిలో బాగా పని చేస్తుంటారు. అందుకే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తున్నారు. ఇద్దరు కెప్టెన్ల పద్ధతికి ఇండియా కూడా సుముఖత చూపకపోవచ్చు. ఇక్కడున్న పరిస్థితుల వల్ల ఈ విధానం సక్సెస్ కాకపోవచ్చు’ అని హుస్సేన్ పేర్కొన్నాడు.
వన్డే వరల్డ్కప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లో చేసినట్లుగా.. ఇండియా మేనేజ్మెంట్ తరచూ టీమ్ సెలెక్షన్ను గందరగోళంలో పడేస్తుంది. ఈ నేపథ్యంలో స్ప్లిట్ కోచింగ్ ఐడియా చాలా మంచిదని హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్ క్రికెట్ మొత్తం దీనిని గౌరవిస్తుందని చెప్పాడు. ‘కోచ్లను విడగొడితే క్రికెట్లో చాలా పెద్ద ప్రయోజనాలు కలుగుతాయి. ఇద్దరు కోచ్లు ఉండటమనేది చెత్త ఐడియా ఎంత మాత్రం కాదు. ఈ విషయంలో ట్రెవర్ బెలిస్ అతిపెద్ద ఎగ్జాంపుల్. ఇంగ్లండ్ తరఫున వైట్బాల్ క్రికెట్లో బెలిస్ చాలా సాధించాడు. అదే టెస్ట్లకు వచ్చేసరికి పెర్ఫామెన్స్ అంత బాగాలేదు. అందుకే ఇద్దరు కోచ్లు ఉండటం మేలని నా అభిప్రాయం. ఇండియా చాలా పకడ్బందిగా టీమ్ను సెలెక్ట్ చేస్తుంది. టీమ్లో గ్రేట్ బ్యాట్స్మెన్ చాలా మంది ఉన్నా నాలుగో ప్లేస్కు సరైన ప్లేయర్ ఉండడు. న్యూజిలాండ్ అలా కాదు. వాళ్ల స్థానాలు పక్కాగా ఉంటాయి. ఇండియా టీమ్లో చాలా టాలెంట్ ఉన్నా.. ఒకటి, రెండుసార్లు ఫెయిల్ అయితే కొత్త వారు వచ్చేస్తారు. అలా జరుగుతూనే ఉంటుంది. ఇది కరెక్ట్ కాదేమో’ అని హుస్సేన్ వివరించాడు.