ప్రపంచం ఎదుర్కొంటున్న హింస, సరిహద్దు ఘర్షణ వంటి అనేక సంక్షోభాలు సద్దుమణగడానికి మహాత్మ గాంధీ ఆచరించిన అహింస,శాంతి సిద్ధాంతలు దోహదం చేస్తాయని భారత విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి ఎస్ . జై శంకర్ అన్నారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తో కలిసి ఎస్ జైశంకర్ ఆవిష్కరించారు. అహింస, శాంతి, నిజాయితీలకు ప్రతిరూపం గాంధీ మహాత్ముడు అని జై శంకర్ కొనియాడారు. ఐక్యరాజ్యసమితిలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా గాంధీజీ పేర్కొన్న ఆదర్శాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకొంటున్నట్లవుతుందని జైశంకర్ తెలిపారు. అటు సామ్రాజ్యవాదంపై మహాత్మా గాంధీకి ఉన్న వ్యతిరేకతే ఐక్య రాజ్య సమితికి పునాది అని గుటెరస్ చెప్పారు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం అక్కడ నెలకొల్పిన విగ్రహాన్ని .. ప్రముఖ భారతీయ శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ రూపొందించారు. దీనిని భారతదేశం ఐక్యరాజ్యసమితికి బహుమతిగా పంపింది.