వ్యాపారి ఇంట్లో రూ. 4 కోట్ల విలువైన నగలు, డబ్బు చోరీ..

వ్యాపారి ఇంట్లో రూ. 4 కోట్ల విలువైన నగలు, డబ్బు చోరీ..
  • రూ.49 లక్షల క్యాష్, బంగారం, వెండి నగలను  ఎత్తుకెళ్లిన దొంగలు
  • పరారీలో వాచ్​మన్​ కుటుంబం

సికింద్రాబాద్, వెలుగు: వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ. 4 కోట్ల విలువైన నగలు, భారీగా డబ్బు మాయమైన ఘటన సికింద్రాబాద్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింధీ కాలనీ పీజీ రోడ్ లోని ఓం శ్రీ అపార్ట్​మెంట్​లో రాహుల్ గోయెల్, నలుగురు సోదరులతో కలిసి ఉంటున్నాడు. వీరి కుటుంబం రాణిగంజ్​లో ఐరన్ వ్యాపారం చేస్తోంది. నేపాల్​కు చెందిన కమల్ ఐదేండ్లుగా వీరి అపార్ట్​మెంట్​లో వాచ్​మన్​గా పనిచేస్తున్నాడు.  కుటుంబంతో కలిసి కమల్​ అపార్ట్​మెంట్​ వద్దే ఉంటున్నాడు. రాహుల్​ కుటుంబం ఈ నెల 9న సిటీ శివార్లలోని ఫాంహౌస్​కు వెళ్లింది. సోమవారం తిరిగి ఇంటికొచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. 

అనుమానంతో రాహుల్..  వాచ్​మన్  కమల్ కోసం వెతకగా కుటుంబంతో సహా అతడు కనిపించలేదు. ఇంట్లోకి వెళ్లి బీరువాలో చూడగా.. రూ.49 లక్షల క్యాష్, 4 కిలోల బంగారం, 10 కిలోల వెండి, వజ్రాలు కనిపించలేదు. సుమారు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల విలువైన సొత్తు చోరీకి గురైందని రాహుల్ పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్​లో పేర్కొన్నాడు. వాచ్​మన్ కమల్ ఈ చోరీకి పాల్పడి ఉంటారని రాహుల్ ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.