
సికింద్రాబాద్, వెలుగు: వైద్యం కోసం హాస్పిటల్కు వచ్చిన మహిళా పేషెంట్తో అసభ్యకరంగా ప్రవర్తించిన డాక్టర్కు నాంపల్లి కోర్టు పదేళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధించింది. సికింద్రాబాద్లోని ఓ ప్రాంతానికి చెందిన మహిళ కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతోంది. 2016, మే 13న సోమాజిగూడలోని ఓ హాస్పిటల్కు వెళ్లగా అక్కడి డాక్టర్ల పరీక్షించి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని భాస్కర చెస్ట్ క్లినిక్కు రిఫర్ చేశారు. అక్కడి డాక్టర్ విజయభాస్కర్ వైద్య పరీక్షల పేరుతో తన గదిలోనికి తీసుకెళ్లి మహిళ ప్రైవేట్ పార్టులను తాకాడు. ఇదేంటి ఇలా చేస్తున్నారని మహిళ ప్రశ్నించగా వైద్య పరీక్షలో భాగంగానే చేస్తున్నానని నమ్మబలికాడు. తర్వాత ఆమె మందులు తీసుకుని వెళ్లి పోయింది.అదే ఏడాది జులైలో అమెరికా వెళ్లిపోయింది. అక్కడ మరోసారి ఊపిరితిత్తుల సంబంధిత సమస్య తలెత్తడంతో తిరిగి సెప్టెంబర్ లో సిటీకి వచ్చింది.
డాక్టర్ విజయ భాస్కర్ను సంప్ర దించగా వైద్య పరీక్షల పేరుతో గతంలో మాదిరిగానే అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పటికే ఓ యువతి తన తల్లితో కలిసి డాక్టర్ వద్దకు వెళ్లి కొద్దిసేపటికి రూమ్ నుంచి బయటకు వచ్చారు. సదరు యువతి బంధువులతో కలిసి డాక్టర్ విజయభాస్కర్తో గొడవకు దిగింది. తన ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది. అదంతా చూసిన సికింద్రాబాద్కు చెందిన మహిళ టెస్టుల సాకుతో డాక్టర్ లైంగికంగా వేధిస్తున్నాడని గోపాలపురం పోలీసులు ఫిర్యాదు చేసింది. 2016, అక్టోబర్ 8న కేసు నమోదు చేసిన పోలీసులు విజయ్కుమార్ను అరెస్ట్ చేశారు. ఈ కేసు మంగళవారం విచారించిన నాంపల్లి సెషన్స్ కోర్టు జడ్జి కె.కవిత.. నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.