ఇండియా టార్గెట్ 50 ఓవర్లలో 226 రన్స్. ఓ దశలో 46.5 ఓవర్లలో 216/6. ఇండియా గెలవాలంటే చివరి 19 బాల్స్లో 10 రన్స్ అవసరం.. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. ఇక విజయం ఖాయమే అనుకుంటున్న టైమ్లో బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుతం చేశారు. వెంటవెంటనే చివరి నాలుగు వికెట్లు తీసి ఇండియా విజయాన్ని అడ్డుకున్నారు! ఆఖరి నాలుగు బాల్స్లో ఒక్క రన్ కూడా చేయలేకపోయిన ఇండియా అమ్మాయిలు చివరకు టైతో గట్టెక్కారు!
మీర్పూర్: టార్గెట్ ఛేజింగ్లో తడబడిన ఇండియా విమెన్స్ టీమ్.. బంగ్లాదేశ్తో శనివారం జరిగిన మూడో వన్డేను టై చేసుకుంది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ 1–1తో డ్రా అవగా ఇరు జట్లు ట్రోఫీని పంచుకున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 225/4 స్కోరు చేసింది. వన్డేల్లో బంగ్లా తరఫున తొలి సెంచరీ సాధించిన విమెన్ బ్యాటర్గా ఫర్జానా హక్ (160 బాల్స్లో 7 ఫోర్లతో 107) రికార్డు సృష్టించింది. షమీమా సుల్తానా (52) , నిగర్ సుల్తానా (24)తో, శోభన మోస్ట్రే (23 నాటౌట్) కూడా రాణించారు. ఇండియా బౌలర్లలో స్నేహ్ రాణా 2, దేవికా వైద్య ఒక్క వికెట్ తీసింది. ఛేజింగ్లో ఇండియా 49.3 ఓవర్లలో సరిగ్గా 225 రన్స్ చేసి ఆలౌటైంది. హర్లీన్ డియోల్(77), స్మృతి మంధాన (59), జెమీమా రోడ్రిగ్స్ (33 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. బంగ్లా బౌలర్లలో నహీదా అక్తర్ 3, మరుఫా అక్తర్ 2 వికెట్లు తీశారు. హర్లీన్ డియోల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ఫర్జానాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
హర్లీన్, స్మృతి మాత్రమే..
నార్మల్ టార్గెట్ ఛేజింగ్లో ఇండియాకు సరైన ఆరంభం లభించలేదు. స్మృతి నిలకడగా ఆడినా, రెండో ఎండ్లో యంగ్స్టర్స్ షెఫాలీ వర్మ (4), యాస్తికా భాటియా (5) ఫెయిలయ్యారు. దీంతో 32 రన్స్కే 2 వికెట్లు కోల్పోయిన ఇండియాను మంధానతో కలిసి హర్లీన్ ఆదుకుంది. బంగ్లా బౌలింగ్ను దీటుగా ఎదుర్కొంటూ ఈ ఇద్దరు మూడో వికెట్కు 107 రన్స్ జోడించారు. అయితే వరుస విరామాల్లో స్మృతి, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (14) రీతిలో ఔట్ కావడంతో ఇండియా 160/4తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో వచ్చిన జెమీమా (33 నాటౌట్) నిలకడగా ఆడుతూ హర్లీన్కు మంచి సహకారం అందించింది. ఫలితంగా 41.1 ఓవర్లలో ఇండియా 191/5 స్కోరుతో పటిష్ట స్థితిలోనే కనిపించింది. కానీ ఇదే ఓవర్ రెండో బాల్కు హర్లీన్ రనౌట్కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. వరుస ఓవర్లలో దీప్తి శర్మ (1), అమన్జ్యోత్ కౌర్ (10), స్నేహ్ రాణా (0), దేవికా వైద్య (0), మేఘనా సింగ్ (5) పెవిలియన్కు చేరడంతో ఇండియా టైతో బయటపడింది.
అంపైరింగ్ ఘోరం: హర్మన్
ఈ మ్యాచ్లోహర్మన్ప్రీత్ ఔటైన తీరు వివాదాస్పదమైంది. 34వ ఓవర్లో నహీదా వేసిన బాల్ను హర్మన్ స్వీప్ చేయగా మిస్ అయి ప్యాడ్లకు తగిలింది. బౌలర్ అప్పీల్ చేయగానే అంపైర్ ఎల్బీగా ఔటిచ్చాడు. అయితే, బాల్ ముందుగా బ్యాట్ కు తగిలిందంటూ హర్మన్ అంపైర్తో గొడవ పడ్డది. కోపంతో బ్యాట్తో స్టంప్స్ను కొట్టేసింది. పెవిలియన్కు వెళ్తూ కూడా అంపైర్పై అసహనం వ్యక్తం చేసింది. అంపైరింగ్ చాలా పేలవంగా ఉందని మ్యాచ్ తర్వాత కూడా హర్మన్ప్రీత్ స్పష్టం చేసింది. ఆన్ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాలు చాలా ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్పింది. ‘ఈ మ్యాచ్ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని మేం భావిస్తున్నాం. క్రికెట్తో పాటు ఇతర అంశాలపై కూడా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా అంపైరింగ్పై. చాలా నిర్ణయాలు మాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈసారి బంగ్లాదేశ్ వచ్చినప్పుడు ఈ రకమైన అంపైర్లతో ఎలా వ్యవహరించాలో నేర్చుకుని వస్తాం’ అని చెప్పింది. క్యాచ్ ఔట్లలోనూ అంపైర్ల నిర్ణయాలు ఘోరంగా ఉన్నాయని ధ్వజమెత్తింది.