న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్నందుకు రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా ఆ దేశం నుంచి ఇతర దేశాలకు డబ్బులు పంపడం ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇండియా, రష్యా సమాలోచనలు జరుపుతున్నాయి. రెండు దేశాల మధ్య చెల్లింపులను ఈజీ చేయడారికి రూపే, మీర్కార్డులను పరస్పరం అనుమతించాలని భావిస్తున్నాయి. రూపే కార్డులను ఇండియా, మీర్ కార్డులను రష్యా జారీ చేస్తాయి. వాణిజ్యం, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకారం (ఐఆర్ఐజీసీ–టెక్)పై ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. ఈ కార్డుల ఆమోదాన్ని అనుమతించే అవకాశాన్ని పరిశీలించడానికి రెండు దేశాలు అంగీకరించాయి. ఫలితంగా ఇండియా, రష్యన్ పౌరులు తమ దేశాల్లో భారతీయ రూపాయి, రష్యన్ రూబుల్లో ఇబ్బందులు లేకుండా డబ్బును చెల్లించగలుగుతారు. ఈ సమావేశాలకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ అధ్యక్షత వహించారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), బ్యాంక్ ఆఫ్ రష్యా అందించే ‘ఫాస్ట్ పేమెంట్స్ సిస్టమ్’ (ఎఫ్పీఎస్) విధానాలను ఇరు దేశాలు వాడుకునే ప్రపోజల్పైనా చర్చలు జరిగాయి. సరిహద్దు చెల్లింపుల కోసం రష్యా ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్ను, బ్యాంక్ ఆఫ్ రష్యా సర్వీసెస్ బ్యూరో ఆఫ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్ను వాడుకోవడానికి రెండు దేశాలూ అంగీకరించాయి. ఇక నుంచి భారతదేశం నుంచి విదేశీ చెల్లింపులు స్విఫ్ట్ నెట్వర్క్ ద్వారా జరుగుతాయి. ఆంక్షలు అమల్లో ఉన్నందున భారతదేశం స్విఫ్ట్ నెట్వర్క్ను కాకుండా వేరేదాన్ని ఎంచుకోవడం సాధ్యం కాదు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ యూపీఐ, పేనౌ మధ్య క్రాస్బార్డర్ కనెక్టివిటీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇండియా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), సింగపూర్ పేనౌ వల్ల రెండు దేశాల్లోని ప్రజలు వేగంగా, తక్కువ ఖర్చుతో కూడిన డిజిటల్ పేమెంట్స్ సేవలను పొందవచ్చు.
రూపీ ట్రేడ్ సెటిల్మెంట్ మెకానిజంలో రష్యా
డాలర్లకు బదులు రూపాయల్లో వ్యాపారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రూపీ ట్రేడ్ సెటిల్మెంట్ మెకానిజం’లో ఇది వరకే రష్యాతోపాటు మారిషస్, శ్రీలంక వంటి దేశాలు చేరాయి. తజికిస్థాన్, క్యూబా, లగ్జెంబర్గ్ ఈ విధానాన్ని ఉపయోగించడం గురించి భారతదేశంతో మాట్లాడుతున్నాయని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ రిపోర్ట్ వెల్లడించింది. ఆంక్షల విధింపు వల్ల రష్యా డాలర్లలో చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మనదేశంతో వ్యాపారానికి రూపాయి సెటిల్మెంట్ విధానాన్ని ఉపయోగిస్తోంది. రూపీ ట్రేడ్సెటిల్మెంట్ మెకానిజాన్ని ఆర్బీఐ పోయిన ఏడాది జూలైలో అందుబాటులోకి తెచ్చింది. డాలర్ల కొరత ఉన్న దేశాలను ఈ విధానంలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వోస్ట్రో ఖాతాలు అని పిలిచే ప్రత్యేక రూపాయి ఖాతాలను తెరవడానికి ఇదివరకే నాలుగు దేశాలు ఆసక్తి చూపాయి.