హఫీజ్‌ సయీద్‌ను అప్పగించండి.. పాకిస్తాన్కు భారత్‌ అభ్యర్థన

హఫీజ్‌ సయీద్‌ను అప్పగించండి.. పాకిస్తాన్కు భారత్‌ అభ్యర్థన

లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలని పాకిస్తాన్ ను భారత్ కోరినట్లు తెలుస్తోంది. సయీద్ ను భారత్‌కు అప్పగించాలని పాకిస్తాన్‌ ను భారత్‌ అధికారికంగా అడిగినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. హఫీజ్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పాక్‌ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థన పంపినట్లు సదరు కథనాలు తెలిపాయి. 

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో హ‌ఫీజ్ స‌యీద్ కూడా ఒక‌రు. ముంబై ఉగ్రదాడుల‌కు సంబంధించి విచార‌ణ నిమిత్తం స‌యీద్‌ను అప్పగించాల‌ని భార‌త్ ప‌దే ప‌దే డిమాండ్ చేస్తున్నప్పటికీ.. పాక్ మాత్రం స్పందించ‌డం లేదు. భార‌త్ – పాకిస్తాన్ మ‌ధ్య ఖైదీల అప్పగింత ఒప్పందం లేక‌పోవ‌డంతో ఈ ప్రక్రియ మ‌రింత క్లిష్టంగా మారింది. 

2008 నవంబరు 26న ముంబయిలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పాటు మరెన్నో ఉగ్రదాడుల్లో హఫీజ్‌ సయీద్‌ కీలక సూత్రధారిగా ఉన్నాడు. భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదుల్లో ఒకడైన సయీద్‌ను.. ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 

సయీద్ తలపై అమెరికా 10 మిలియన్‌ డాలర్ల రివార్డ్‌ ప్రకటించింది. వీటితోపాటు ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించారన్న ఆరోపణలతో పలు మనీలాండరింగ్‌ కేసుల్లోనూ హఫీజ్‌పై ఎన్నో కేసులు ఉన్నాయి.

ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నారన్న పలు కేసుల్లో హఫీజ్‌ 2019లో అరెస్టయ్యాడు. ఈ కేసులకు సంబంధించి అతడికి 31 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం పాక్‌ జైల్లో ఉన్న హఫీజ్‌.. అక్కడి నుంచే దేశ రాజకీయాలను శాసిస్తున్నట్లు పలు కథనాలు చెబుతున్నాయి. 

సయీద్‌ ఏర్పాటు చేసిన ‘ది పాకిస్థాన్‌ మర్కజీ ముస్లిం లీగ్‌’ (పీఎంఎంఎల్‌) పార్టీ.. వచ్చే ఏడాది జరగబోయే పాక్‌ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇదే పార్టీ తరఫున హఫీజ్‌ తనయుడు తల్హా సయీద్‌ ఎన్‌ఏ-127 స్థానం నుంచి బరిలోకి దిగుతున్నాడు.