న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టు నెలలో వంటనూనెల దిగుమతులు భారీగా పెరిగాయి. రాబోయే పండుగ సీజన్ కోసం తగినన్ని నిల్వలు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో రిఫైనరీలు వంటనూనెల దిగుమతులను పెంచుకున్నాయి. ఫలితంగా ఆగస్టు 2023 లో వంటనూనెల దిగుమతులు 5 శాతం పెరిగి 1.85 మిలియన్ టన్నులకు చేరాయి. వంట నూనెల దిగుమతులు పెరగడం వరసగా ఇది రెండో నెలని డీలర్లు చెబుతున్నారు. ఇండియా కొనుగోళ్లు పెరగడం వల్ల ఇండోనేషియా, మలేషియా దేశాలలో పామాయిల్ నిల్వలు తగ్గుతున్నాయని, అంతేకాకుండా ఫ్యూచర్స్ మార్కెట్లో ధరలకు మద్దతుగా నిలుస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
2021–22 లో మన దేశం సగటున నెలవారీగా 1.17 మిలియన్ టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకున్నట్లు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) డేటా చెబుతోంది. ఈ ఏడాది జులై నెలలో దిగుమతులు 1.76 మిలియన్ టన్నులకు పెరిగాయి. జులైలో పామాయిల్ దిగుమతులు 1.09 మిలియన్ టన్నులు కాగా, ఆగస్టు నాటికి ఇవి మరింత పెరిగి 1.12 మిలియన్ టన్నులకు చేరాయని డీలర్లు పేర్కొంటున్నారు. పండుగ సీజన్ కోసం రిఫైనరీలు భారీగా కొనుగోళ్లను జరుపుతున్నారని ఎడిబుల్ ఆయిల్ ట్రేడర్ రాజేష్ పటేల్ చెప్పారు. రిటెయిల్ డిమాండ్ ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ, పండుగ సీజన్లో ఊపందుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయని పేర్కొన్నారు.
ఏడు నెలల్లో ఎన్నడూ లేనంతగా సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు 11.5 శాతం పెరిగి 3.65 లక్షల టన్నులకు చేరాయి. సోయా ఆయిల్ దిగుమతులు కూడా 3.7 శాతం పెరిగాయని డీలర్లు అంచనా వేస్తున్నారు. ఇండోనేషియా, మలేషియా, థాయ్లాండ్ దేశాల నుంచి పామాయిల్ను, అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ను ఇండియా దిగుమతి చేసుకుంటోంది. వర్షపాతం చాలినంతగా లేకపోవడంతో లోకల్ సోయాబీన్, వేరుశనగ దిగుబడి తగ్గుతాయనే భయాలు కూడా దిగుమతులు ఎక్కువవడానికి ఒక కారణం. ఎప్పుడూ లేని విధంగా ఆగస్టులో సాధారణం కంటే 36 % తక్కువ వర్షపాతం రికార్డయింది.