ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే చర్చలకు.. పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఆందోళన

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే చర్చలకు.. పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఆందోళన

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ గురువారం (జులై 23) విపక్షాలు పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేశాయి. మంత్రి రాజీనామా కోరుతూ ఆందోళనకు దిగటంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అనంతరం పార్లమెంటు ఆవరణలో ఫ్లకార్డులతో విపక్ష ఎంపీలు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు.  ఇండియా కూటమి నిరసనలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, అఖిలేశ్ యాదవ్, టీఎంసీ ఎంపీల తదితరులు పాల్గొన్నారు. 

నిన్నటి దాకా పేపర్ లీకేజీపై చర్చకు అవకాశమే లేదని చెప్తూ వస్తున్న కేంద్రం.. దీనిపై చర్చకు రావాలని పిలుపునిచ్చింది. దీంతో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేగానీ చర్చలకు అంగీకరించేది లేదని ఇండియా కూటమి తెగేసి చెప్పింది.  శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు, బలగాల దమనకాండకు వ్యతిరేకంగా గొంతెత్తిన ఎంపీలు.. మంత్రి రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు. 

►ALSO READ | ట్రక్కుల్లో రాళ్లు తీసుకొస్తుంది పోలీసులు.. రాళ్లు విసురుతున్నది బీజేపీ గూండాలు: CJP చీఫ్

మంత్రి రాజీనామా చేస్తే చర్చకు వస్తామని మల్లికార్జున ఖర్గే చెప్పారు.  నెలల తరబడి విద్యార్థులు నిరసనలు చెబుతున్నా ఎన్నడూ స్పందించని ప్రధాని.. ఇప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ విషయంలో ప్రధాని మాటలు ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. 

మరోవైపు విపక్షాల నిరసనకు ధీటుగా అధికార ఎన్డీఏ ఎంపీలు కూడా నిరసనలకు దిగారు. పార్లమెంటు సమావేశాలను ఇండియా కూటమి అడ్డుకుంటోందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. చర్చలు జరగకుండా ఆటంకం కల్పిస్తున్నారని ఆరోపించారు. అధికార, విపక్ష ఎంపీల నిరసనలతో పార్లమెంటు ఆవరణలో ఉద్రిక్త వాతారణం కనిపించింది.