హిందూ మహాసముద్రంలో పైరసీని ఎదుర్కొంటాం :మోదీ

హిందూ మహాసముద్రంలో పైరసీని ఎదుర్కొంటాం :మోదీ

న్యూఢిల్లీ: హిందూ మహాసముద్రంలో పైరసీ, టెర్రరిజంపై పోరుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్ ​గురైన తమ వాణిజ్య ఓడను ఇండియన్​ నేవీ కాపాడడంతో బల్గేరియా అధ్యక్షుడు రుమెన్​ రాదెవ్ ఎక్స్​లో​ కృతజ్ఞతలు తెలపగా, మోదీ స్పందించారు. ‘మీ పౌరులు క్షేమంగా ఉన్నారు. త్వరలోనే తిరిగొస్తారు’ అని మోదీ రిప్లై ఇచ్చారు. 8 మంది బల్గేరియన్లు, 9 మంది మయన్మార్ పౌరులు, ఒక అంగోలన్​ ఉన్న వాణిజ్య నౌక ‘రూయెన్​’ను  నిరుడు డిసెంబర్​లో సోమాలియా దొంగలు హైజాక్​ చేశారు. భారత నావికాదళం రెస్క్యూ ఆపరేషన్​ నిర్వహించి, రూయెన్​ను రక్షించింది. కాగా, ఈ నెల 16న బల్గేరియా విదేశాంగ శాఖ మంత్రి మరియా గాబ్రియెల్​ ఫేస్​బుక్​లో పోస్ట్​ పెట్టారు. ‘నిరుడు డిసెంబర్​లో హైజాక్​కు గురైన రూయెన్​ నౌకను ఇండియా నేవీ రక్షించింది. అందులో ఉన్న నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. ఇండియన్ నేవీకి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.