న్యూయార్క్: ఉత్తర కొరియా చేపట్టిన ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగాన్ని మన దేశం ఖండించింది. న్యూక్లియర్, మిసైల్ టెక్నాలజీ విస్తరించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. యునైటెడ్ నేషన్స్లో మంగళవారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో ఇండియా శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడారు.
ఇలాంటి వెపన్స్ ప్రపంచ దేశాల శాంతిభద్రతలకే ప్రమాదమని అన్నారు. కొరియా దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు, డీన్యూక్లియరైజేషన్కు ఇండియా మద్దతు ఇస్తుందని చెప్పారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు, భద్రతా మండలి కలసికట్టుగా ఉండాలని ఆమె కోరారు. ఇటీవల ఉత్తర కొరియా మిసైల్ టెస్ట్ చేయగా.. ఆ దేశ ప్రెసిడెంట్ కిమ్ భార్య, కూతురుతో కలిసి శక్తిమంతమైన ఇంటర్కాంటినెంటల్ మిసైల్ టెస్ట్ను పరిశీలించారు. శత్రువుల బెదిరింపులు కొనసాగితే న్యూక్లియర్ వెపన్స్ తో సమాధానం ఇస్తామని కిమ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే యూఎన్లో భద్రతా మండలి రెండోసారి సమావేశమైంది.