‘‘ దేవుడు ఉన్న చోట దెయ్యాలు కూడా ఉంటాయి. మక్కా యాత్ర మొదటి రోజున హజ్ యాత్రికులు సైతాన్ ను(దయ్యాన్ని) రాళ్లతో కొడుతారు. దేశంలో కొంతమంది బీజేపీ నేతలు దెయ్యాలుగా మారారు. వారికి కూడా ఇలాగే బుద్ధి చెబుతామని అందరూ ప్రతిన బూనాలి’’ అని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నగరంలోని హుస్సేనీపురలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. ‘‘రాక్షసులను ఓడించి, సాగనంపే శక్తి ఇవ్వాలని అల్లాను కోరుకొని రండి’’ అని హజ్ యాత్రికులను కోరారు. ‘‘ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యల వల్ల ప్రపంచం ముందు మన భారతదేశం తలదించుకునే పరిస్థితి వచ్చింది. అరబ్ దేశాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది’’ అని ఆయన గుర్తుచేశారు. సర్వ మతాల వేదిక తెలంగాణ రాష్ట్రం అని గంగుల కమలాకర్ కొనియాడారు. హిందూ, ముస్లింల మధ్య చిచ్చురేపుతున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.