
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల ఎగుమతులు దెబ్బతినడం, సరఫరాలు కొంతవరకు తగ్గడంతో గత నెల పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) కాస్త తగ్గి 54.5 పాయింట్లుగా రికార్డు అయింది. వస్తువుల తయారీ ఖర్చులు (ఇన్పుట్ కాస్ట్లు) కూడా పెరిగాయి. మనదేశం తయారీరంగం (మాన్యుఫ్చాక్చరింగ్ సెక్టార్) ఫిబ్రవరిలో నిలకడగానే ఉంది. అయితే జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో పీఎంఐ కాస్త తగ్గింది. కొత్త ఆర్డర్లు, స్టాకులు, తయారీ, సప్లైలు, ఉపాధి వంటి వివరాల ఆధారంగా పీఎం ఇండెక్స్ను తయారు చేస్తారు. ఇది ఎకానమీ సామర్థ్యాన్ని సూచిస్తుంది. పీఎంఐ 50 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ బాగున్నట్టుగా పరిగణిస్తారు. ఈ ఏడాది జనవరిలో పీఎం 55.3పాయింట్లుగా రికార్డు కాగా, ఇది గత నెల 54.5 పాయింట్లకు పరిమితమయింది. గత ఎనిమిది ఏళ్లలో ఇదే అత్యధికం. గత 31 నెలలుగా పీఐఎం 50 పాయింట్లకు మించి రికార్డు కావడం విశేషం. ‘‘డొమెస్టిక్, ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి కంపెనీలకు ఫిబ్రవరిలోనూ బాగా ఆర్డర్లు వచ్చాయి. దీనివల్ల వాటిలో ప్రొడక్షన్ బాగా పెరిగింది. ఇన్పుట్లు కూడా అధికమయ్యాయి. కరోనా వైరస్ వల్ల ఇక మీదట ఎగుమతులు, సప్లై చైన్లకు ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఇదే జరిగితే ఉద్యోగాలూ తగ్గుతాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గితే ఆర్డర్లు, ఉద్యోగాలు పెరుగుతాయి’’ అని ఐహెచ్ఎస్ మార్క్ఇట్ ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ పొలియానా డి లిమా చెప్పారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎకానమీ ‘చైనా’కు కరోనా కేసులు తీవ్ర నష్టం కలిగించడం తెలిసిందే. అక్కడి ఫ్యాక్టరీల్లో చాలా వరకు మూతపడ్డాయి.