
న్యూఢిల్లీ: ఫిన్ టెక్ సెక్టార్ గ్రోత్లో అమెరికా, యూకే సరసన ఇండియా నిలిచింది. ఈ సెక్టార్ లాభదాయకత, అందరికీ సర్వీస్లు అందివ్వడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ రిపోర్ట్ను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసింది. ఫిన్టెక్ హాట్స్పాట్లలో యూకే, భారత్, అమెరికా, సింగపూర్, బ్రెజిల్, ఇండోనేషియా ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రతి ఒక్కటి 10 కంటే ఎక్కువ ఫిన్టెక్ కంపెనీలకు హెడ్క్వార్టర్స్గా ఉంది.
ఫిన్టెక్లు ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశాల్లో అమెరికా, యూకే, భారత్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రెజిల్, కొలంబియా, మెక్సికో, ఇండోనేషియా, జర్మనీ ఉన్నాయి. కరోనా తర్వాత కాస్త మందగమనం ఉన్నప్పటికీ, ఈ సెక్టార్ నిలకడగా వృద్ధి చెందుతోందని, ఫైనాన్షియల్ సర్వీస్లు అందని వారికీ చేరువవుతోందని డబ్ల్యూఈఎఫ్ రిపోర్ట్ పేర్కొంది. గ్లోబల్గా 240 ఫిన్టెక్ కంపెనీలను సర్వే చేసి ఈ రిపోర్ట్ రెడీ చేసింది.
దీని ప్రకారం, ఏఐతో కస్టమర్ల ఎక్స్పీరియన్స్ మెరుగుపడిందని 83 శాతం ఫిన్టెక్ కంపెనీలు పేర్కొన్నాయి. లాభం పెరిగిందని 75శాతం కంపెనీలు వెల్లడించాయి. ఆర్థిక పరిస్థితులు గ్రోత్కు పెద్ద సవాలుగా ఉన్నాయని చెప్పినా, కేవలం18శాతం మాత్రమే దీన్ని అడ్డంకిగా చూస్తున్నారు. 2024లో ఈ నెంబర్ 56శాతంగా ఉండేది. ఫండింగ్ వాతావరణంపై ఆందోళనలు కూడా తగ్గాయి. 12శాతం మాత్రమే దీన్ని సమస్యగా చెప్పారు. గత ఏడాది ఇది 40శాతంగా ఉండేది.