
న్యూఢిల్లీ: కరోనా కేసుల విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం చాలా మంచి పొజిషన్లోనే ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చేస్తున్న టెస్టులు, బయటపడిన కేసులను లెక్కలోకి తీసుకుంటే అభివృద్ధి చెందిన దేశాల కన్నా ఇండియా బెటర్ అని చెప్పింది. దేశంలో టెస్టుల సంఖ్య 5 లక్షలు దాటింది. కేసులు 23 వేలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటలీ, స్పెయిన్, అమెరికా దేశాల్లో ఆ టెస్టులు, కేసులతో పోల్చి చూస్తే కరోనా కట్టడిలో ముందున్నామని కేంద్రం అంటోంది. మొత్తంగా చేసిన టెస్టులతో పోలిస్తే కేసుల రేటు 4.5 శాతంగా నమోదైంది. అదే అమెరికాలో 16 శాతం పైనే ఉంది. మరోవైపు దేశంలో కేసులు రెట్టింపయ్యే రోజుల సంఖ్య కూడా పెరిగింది. వెనువెంటనే లాక్డౌన్ ప్రకటించడం, కరోనా పేషెంట్ల కాంటాక్ట్లను గుర్తించడం వంటి చర్యలతో వైరస్ వ్యాప్తి చాలా వరకు తగ్గింది. మార్చి 21న కేసులు రెట్టింపయ్యేందుకు 3 రోజులు పడితే ఇప్పుడు అది 8.6 రోజులకు పెరిగింది. ఎంపవర్డ్ కొవిడ్19 గ్రూప్ మెంబర్, నీతి ఆయోగ్ చైర్మన్ డాక్టర్ వీకే పాల్ ఈ లెక్కలను వెల్లడించారు. లాక్డౌన్ పెట్టకపోయి ఉంటే ఈ పాటికల్లా దేశంలో 73 వేల కేసులుండేవని చెప్పారు.