ఇండియన్​ స్టూడెంట్లకు కేంద్ర ప్రభుత్వం కొత్త అడ్వైజరీ

ఇండియన్​ స్టూడెంట్లకు కేంద్ర ప్రభుత్వం కొత్త అడ్వైజరీ

న్యూఢిల్లీ: చైనాలో మెడిసిన్​ చదవాలనుకునే ఇండియన్​ స్టూడెంట్లకు కేంద్ర ప్రభుత్వం కొత్త అడ్వైజరీని జారీ చేసింది. అక్కడ చదివే టైమ్​లో ఎదురయ్యే సవాళ్ల గురించి అందులో వివరించింది. అధికారిక లెక్కల ప్రకారం 23 వేల మంది ఇండియన్​ స్టూడెంట్లు చైనా వర్సిటీల్లో చదవడానికి నమోదు చేసుకున్నారు. 2020లో చైనాలో కరోనా ప్రబలిన తర్వాత వేల మంది మన దేశ విద్యార్థులు స్వదేశానికి వచ్చారు. ఆపై చైనా వీసా ఆంక్షలతో రెండేళ్లుగా ఇక్కడే చిక్కుకుపోయారు. ఇప్పుడిప్పుడే కొవిడ్​ వీసా ఆంక్షలను చైనా సడలిస్తోంది. వివిధ దేశాల్లో చిక్కుకున్న స్టూడెంట్లకు పరిమిత సంఖ్యలో వీసాలు జారీ చేస్తున్నది. అయితే, చైనా, ఇండియా​ మధ్య ఇంకా డైరెక్ట్​ ఫ్లైట్స్​ స్టార్ట్​ కాకపోవడంతో మన స్టూడెంట్లు ఇక్కడే ఉండిపోయారు. ఈలోగానే చైనా మెడికల్​ కాలేజీలు ఎన్​రోల్​మెంట్​ ప్రాసెస్​ను ప్రారంభించాయి. దీంతో చైనాలో మెడిసిన్​ చదవాలనుకునే ఇండియన్​ స్టూడెంట్ల కోసం బీజింగ్​లోని ఇండియన్​ ఎంబసీ అడ్వైజరీని జారీ చేసింది.

ఎఫ్ఎంజీలో మనోళ్లు 16% మందే పాస్​

విదేశాల్లో ఎంబీబీఎస్​ చదివిన ఇండియన్లు మన దేశంలో ప్రాక్టీస్​ చేయాలంటే మెడికల్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా(ఎంసీఐ) నిర్వహించే ఫారెన్​ మెడికల్​ గ్రాడ్యుయేట్(ఎఫ్ఎంజీ) టెస్టులో పాస్  కావాల్సి ఉంటుంది. 2015 నుంచి 2021 మధ్య ఎఫ్ఎంజీ టెస్టుకు 40,417 మంది హాజరుకాగా 6,387 మందే (16 శాతమే) పాసయ్యారు. వారందరూ చైనాలోని 45 అక్రెడిటెడ్​ యూనివర్సిటీల్లో చదివారు. దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం కేంద్రం అడ్వైజరీని రిలీజ్ చేసింది. ‘‘వివిధ వర్సిటీల్లో ఫీజులు భిన్నంగా ఉంటాయి. అడ్మిషన్​కు ముందు స్టూడెంట్లు ఈ విషయాన్ని గమనించాలి. చైనా అక్రెడిటెడ్​ వర్సిటీల్లో మాత్రమే అడ్మిషన్​ తీసుకోవాలి. డిగ్రీ పూర్తిచేసిన దేశంలోనే స్టూడెంట్లు లైసెన్స్​ తీసుకోవాలి. ఇంటర్న్​షిప్​ పూర్తయ్యాక విద్యార్థులు చైనీస్​ మెడికల్​ క్వాలిఫికేషన్​ఎగ్జామ్​ను క్లియర్​ చేయాలి. ఇండియాలో ప్రాక్టీస్​ చేయాలంటే విద్యార్థులు అర్హత పరీక్షలో పాస్​ కావాలె. చైనా నుంచి మెడికల్​ క్వాలిఫికేషన్​ పొందాలనుకునేవారు నీట్​ యూజీ ఎగ్జామ్​ను క్లియర్​ చేయాలి” అని కేంద్రం పేర్కొంది.