లీసెస్టర్: ఐపీఎల్లో ధనాధన్ బ్యాటింగ్తో మెరుపులు మెరిపించిన ఇండియా టాప్ ప్లేయర్లు.. లీసెస్టర్షైర్తో గురువారం మొదలైన వామప్ మ్యాచ్లో ఫెయిలయ్యారు. 20 ఏళ్ల యంగ్ పేసర్ రోమన్ వాకర్ (5/24) స్వింగ్, బౌన్స్ దెబ్బకు టీమిండియా టాపార్డర్ కుదేలైంది. అయితే తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ (111 బాల్స్లో 8 ఫోర్లు, 1 సిక్స్తో 70 బ్యాటింగ్) పోరాట స్ఫూర్తి చూపెట్టాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (33)తో కలిసి కీలక భాగస్వామ్యంతో టీమ్ను ఆదుకున్నాడు. వర్షం పలుసార్లు అంతరాయం కలిగించిన పోరులో మొదటి రోజు చివరకు ఇండియా 60.2 ఓవర్లలో 246/8 స్కోరు చేసింది. భరత్తో పాటు మహ్మద్ షమీ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
81కే 5 వికెట్లు..
మేఘావృత వాతావరణంలో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇండియాకు ఆరంభం కలిసి రాలేదు. మంచి టచ్లో కనిపించిన రోహిత్ శర్మ (25) తన షార్ట్ పిచ్ బలహీనతకు మరోసారి బోల్తా పడ్డాడు. వాకర్ వేసిన షార్ట్ బాల్ను ఫుల్ చేయబోయి క్యాచ్ ఇచ్చాడు. ఇక, ఓపెనర్గా వచ్చిన అవకాశాన్ని శుభ్మన్ గిల్ (21) ఒడిసి పట్టుకోలేకపోయాడు. డావిస్ (2/64) స్వింగ్ను అర్థం చేసుకోలేక ఔటయ్యాడు. ఐదో నంబర్ కోసం పోటీలో ఉన్న హనుమ విహారి (3), శ్రేయస్ (0) కూడా నిరాశ పరిచారు. కోహ్లీ మాత్రం ఓపిక చూపెట్టాడు. బాల్ ఎక్కువ స్వింగ్ అవడంతో తను డిఫెన్స్కు ప్రాధాన్యమివ్వగా, జడేజా (13) ఎక్కువసేపు నిలబడలేదు. దీంతో ఇండియా 81 రన్స్కే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రీకర్ నిలకడైన ఆటతో కోహ్లీకి అండగా నిలిచాడు. ఈ ఇద్దరూ ఇండో–ఇంగ్లిష్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. కానీ, మరో స్పెల్కు వచ్చిన వాకర్ వరుస ఓవర్లలో కోహ్లీ, శార్దూల్ (6)ను పెవిలియన్కు పంపాడు. ఉమేశ్ (23) అండతో స్కోరు 200 దాటించిన భరత్.. షమీతో కలిసి మరో వికెట్ పడకుండా రోజు ముగించాడు.
బుమ్రా దెబ్బకు రోహిత్ విలవిల
ఈ మ్యాచ్లో మనోళ్లకు మనోళ్లే ప్రత్యర్థులయ్యారు. అనధికార మ్యాచ్ కావడంతో ఎక్కువ మందికి ప్రాక్టీస్ లభించేందుకు బుమ్రా, ప్రసిధ్, పంత్, పుజారా లీసెస్టర్ తరఫున బరిలోకి దిగారు. యార్కర్లు, బౌన్సర్లతో ప్రత్యర్థులను హడలెత్తించే ఇండియా స్టార్ పేసర్ బుమ్రా.. ఈ సారి రోహిత్ శర్మకు తన బౌలింగ్ పదును చూపెట్టాడు. తొలిసారి ఓ కాంపిటీటివ్ మ్యాచ్లో బుమ్రాను ఎదుర్కొన్న హిట్మ్యాన్ అతని బాల్స్కు ఇబ్బంది పడ్డాడు. ఏడో ఓవర్లో బుమ్రా వేసిన ఓ రైజింగ్ బాల్ రోహిత్కు గజ్జల్లో బలంగా తగిలింది. నొప్పికి విలవిల్లాడిన ఇండియా కెప్టెన్ కాసేపు మోకాళ్లపై కూర్చుండిపోయాడు. దాంతో, అంతా కంగారు పడ్డారు. ఫిజియో వచ్చి పరీక్షించాడు. ఆ తర్వాత రోహిత్ బ్యాటింగ్ కొనసాగించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆపై, శ్రేయస్ అయ్యర్ను ప్రసిధ్ కృష్ణ తన తొలి బాల్కే ఔట్ చేయడం విశేషం.
టీమ్లోకి అశ్విన్
కరోనా నుంచి కోలుకున్న స్పిన్నర్అశ్విన్ గురువారం టీమ్తో కలిశాడు. వామప్ మ్యాచ్ మొదలయ్యే ముందు మిగతా ఆటగాళ్లతో కలిసి తను గ్రౌండ్లో కనిపించాడు