న్యూఢిల్లీ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి కొనుగోలు చేసిన ముడి చమురు కోసం భారతదేశం మొట్టమొదటిసారిగా రూపాయల్లో చెల్లింపులు జరిపింది. ఇలాంటివి మరిన్ని ఒప్పందాలను కుదుర్చుకోవాలని చూస్తున్నామని అధికారులు తెలిపారు. మనదేశం తన చమురు అవసరాలను తీర్చడానికి 85 శాతానికి పైగా దిగుమతులపై ఆధారపడుతోంది. అందుకే వీలైనంత తక్కువ ధరకు ఇచ్చే దేశాల నుంచి కొంటోంది.
రష్యా నుంచి భారీగా కొనుగోలు చేస్తోంది. రూపాయల్లో చెల్లింపు బిలియన్ల డాలర్లను ఆదా చేయడంలో సహాయపడింది. భారతదేశం ఈ ఏడాది జూలైలో రూపాయి సెటిల్మెంట్ కోసం యూఏఈతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) భారతీయ రూపాయలలో అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నాక్) నుంచి మిలియన్ డాలర్లు బ్యారెళ్ల ముడి చమురు కోసం రూపాయల్లో చెల్లించింది. రష్యా చమురు దిగుమతులు కూడా రూపాయల్లోనే జరుగుతున్నాయి. ముడి చమురు దిగుమతికి డిఫాల్ట్ కరెన్సీగా యూఎస్ డాలరే ఉంటోంది.
18 దేశాలతో ఒప్పందాలు
సరిహద్దు దేశాలకు చెల్లింపులలో రూపాయి పాత్రను పెంచడానికి, ఆర్బీఐ డజనుకు పైగా బ్యాంకులను 18 దేశాలతో రూపాయలలో లావాదేవీలను సెటిల్ చేసుకోవడానికి గత సంవత్సరం అనుమతించింది. అప్పటి నుంచి యూఏఈ, సౌదీ అరేబియా వంటి పెద్ద చమురు ఎగుమతిదారులను వాణిజ్య సెటిల్మెంట్ల కోసం భారత కరెన్సీని అంగీకరించాలని భారతదేశం కోరుతోంది. ఈ ఏడాది ఆగస్టులో ఐఓసీ అడ్నాక్కి రూపాయి చెల్లింపు చేయడంతో మొదటి విజయం సాధించినట్లు అధికారులు తెలిపారు.