- నిరాశపర్చిన టాప్ ఆర్డర్
- రాణించిన జడేజా
- అండర్సన్కు 3 వికెట్లు
బర్మింగ్హామ్: ఇండియన్ క్రికెట్లో రిషబ్ పంత్ (111 బాల్స్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 146) ఎంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపితమైంది. సహజ సిద్ధమైన దూకుడు, భయంలేని ఆటతో మరోసారి టీమిండియాను ఆదుకున్నాడు. మేఘావృత వాతావరణంలో.. ఇంగ్లిష్ బౌలర్ల దెబ్బకు స్టార్లందరూ పెవిలియన్కు క్యూ కట్టిన వేళ.. అద్భుతమైన సెంచరీకి తోడు, రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్)తో కీలక పార్ట్నర్షిప్ను నెలకొల్పి బుమ్రాసేనను మ్యాచ్లో నిలబెట్టాడు. దీంతో శుక్రవారం ఇంగ్లండ్తో ప్రారంభమైన ఐదో టెస్ట్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 73 ఓవర్లలో 7 వికెట్లకు 338 రన్స్ చేసింది. జడేజాతో పాటు మహ్మద్ షమీ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
98 కే 5 వికెట్లు
మార్నింగ్ సెషన్లో అండర్సన్ (3/52) దూకుడుకు.. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (17), చతేశ్వర్ పుజారా (13) రన్స్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. బంతిని టచ్ చేయడానికి కూడా భయపడి డిఫెన్స్కే పరిమితమయ్యారు. ఈ ఒత్తిడిలో 46 రన్స్కే ఇద్దరూ పెవిలియన్కు చేరారు. వీళ్లిద్దరూ సెకండ్ స్లిప్లో క్రాలీకే క్యాచ్ ఇచ్చారు. కొద్దిసేపటికే పాట్స్ (2/85) బౌలింగ్లో విహారి (20) ఇచ్చిన క్యాచ్ను క్రాలీ వదిలేశాడు. లేదంటే లంచ్కు ముందే మూడు వికెట్లు పడేవి. వర్షం వల్ల 20 నిమిషాలు ముందే బ్రేక్కు వెళ్లిన ఇండియాకు.. రెండో సెషన్లో పాట్స్ ప్రమాదకరంగా మారాడు. స్వింగ్తో పాటు షార్ట్ పిచ్లతో కోహ్లీ (11), విహారిని టార్గెట్ చేసి సక్సెస్ అయ్యాడు. బ్రేక్ తర్వాత రెండో ఓవర్లోనే పాట్స్ వేసిన స్ట్రెయిట్ డెలివరీ విహారిని ఎల్బీ చేసింది. తన తర్వాతి ఓవర్లో వేసిన హాఫ్ వ్యాలీని విరాట్ వికెట్ల మీదకు ఆడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 12 బాల్స్ తేడాలో ఈ ఇద్దరు ఔటవడం స్కోరు బోర్డుపై ప్రభావం చూపింది. ఈ దశలో వచ్చిన రిషబ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. స్టార్టింగ్లో నెమ్మదిగా ఆడినా.. తర్వాత తన స్టైల్ ఆటను చూపెట్టాడు. పాట్స్ బౌలింగ్లో మూడు ఫోర్లు కొట్టి టచ్లోకి వచ్చిన శ్రేయస్ (15) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సెకండ్ స్పెల్కు వచ్చిన అండర్సన్ తన మార్క్ స్వింగ్తో శ్రేయస్ను దెబ్బకొట్టాడు. పక్కటెముకల లక్ష్యంగా వేసిన షార్ట్ పిచ్ను ఆడే క్రమంలో శ్రేయస్.. బిల్లింగ్స్ సూపర్ డైవ్ క్యాచ్కు వెనుదిరిగాడు. దీంతో 98/5తో ఇండియా కష్టాల్లో పడింది. ఈ టైమ్లో జడేజాతో కలిసి పంత్ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు.
బౌలర్ ఎవరైనా సరే చెత్త బాల్ దొరికితే బౌండ్రీ దాటించడంతో ఇంగ్లిష్ ఫీల్డర్లు రోప్ దగ్గరకు వెళ్లక తప్పలేదు. రూట్, లీచ్ను టార్గెట్ చేస్తూ నాలుగు భారీ సిక్సర్లు కొట్టాడు. అండర్సన్ బౌలింగ్లో కొట్టిన రివర్స్ స్వీప్ మ్యాచ్కే హైలెట్. ఈ క్రమంలో పంత్ 89 బాల్స్లోనే సెంచరీ ఫినిష్ చేశాడు. రెండో ఎండ్లో సింగిల్స్తో సరిపెట్టుకున్న జడ్డూ.. 109 బాల్స్లో ఫిఫ్టీ మార్క్ను అందుకున్నాడు. దాదాపు 42 ఓవర్ల పాటు క్రీజులో ఉన్న ఈ ఇద్దరూ ఆరో వికెట్కు 222 (239 బాల్స్) రన్స్ జత చేసి ఇండియాను రేస్లోకి తెచ్చారు. 150 మార్క్ దిశగా సాగుతున్న పంత్ను పార్ట్ టైమర్ రూట్.. స్లో, వైడ్ బాల్తో బోల్తా కొట్టించాడు. శార్దూల్ (1) విఫలమైనా, షమీతో కలిసి జడేజా మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు.