
- రాత్రి 7 గంటల నుంచి డీడీ స్పోర్ట్స్, జియో సినిమాలో లైవ్
తరౌబా: వెస్టిండీస్తో 2006 నుంచి పోటీపడ్డ 12 వన్డే సిరీస్ల్లో టీమిండియా గెలిచింది. తాజా సిరీస్లోనూ ఇండియా ఫేవరెట్గా బరిలోకి దిగింది. కానీ, రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చి చేసిన ప్రయోగం బెడిసికొట్టడంతో ఇప్పుడు విండీస్ చేతిలో సిరీస్ కోల్పోయే ప్రమాదం ముంగిట నిలిచింది. ఈ ప్రమాదం తప్పించుకొని విండీస్పై వరుసగా 13వ సిరీస్ నెగ్గడమే లక్ష్యంగా మంగళవారం జరిగే చివరి, మూడో వన్డేలో ఇండియా బరిలో దిగనుంది. అది జరగాలంటే సంజు శాంసన్, సూర్యకుమార్లతో కూడిన మిడిలార్డర్ మెప్పించాల్సి ఉంది. గత మ్యాచ్లో ఓడినప్పటికీ ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో తాము దూరదృష్టితో ఉండాలని, ఒక మ్యాచ్, ఒక సిరీస్ గురించి ఆందోళన చెందడం తప్పవుతుందని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. రోహిత్, కోహ్లీకి రెస్ట్ ఇవ్వడాన్ని సమర్థించుకున్నాడు.
అతను అదే అభిప్రాయంతో ఉంటే మూడో వన్డేలోనూ ప్రయోగాలు కొనసాగి సూర్య, శాంసన్ తుది జట్టులో ఉంటారు. మున్ముందు మరిన్ని అవకాశాలు రావాలంటే ఈ మ్యాచ్ ఇండియాతో పాటు ఈ ఇద్దరికీ చావో రేవో కానుంది. 50వ ఓవర్ల ఫార్మాట్లో తడబాటుకు సూర్య ఈ పోరుతో అయినా చెక్ పెట్టాలని అంతా ఆశిస్తున్నారు. టీమ్లో లెక్కలేనన్ని సార్లు రీఎంట్రీలు ఇస్తున్న శాంసన్ ఈసారైనా తన బ్యాట్కు పని చెబుతాడేమో చూడాలి. రెండో వన్డే మాదిరిగా తను మూడో ప్లేస్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్లో ఇప్పటిదాకా టీమిండియాకు లభించిన సానుకూలాంశం ఓపెనర్ ఇషాన్ కిషన్ ఫామ్. టెస్ట్ సిరీస్ నుంచి బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్న అతను వరుసగా రెండు ఫిఫ్టీలు కొట్టి జోరుమీదున్నాడు. విండీస్ గడ్డపై ఇప్పటిదాకా మెప్పించలేకపోయిన శుభ్మన్ గిల్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఇక, తొలి రెండు వన్డేల్లో బౌలింగ్ ఎటాక్ను ప్రారంభించిన హార్దిక్ పాండ్యా క్రమంగా తన వర్క్లోడ్ను పెంచుకున్నాడు. బ్యాట్తో మాత్రం తన బెస్ట్కు చాలా దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో మెప్పిస్తే టీ20 సిరీస్కు ముందు అతనిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా మిడిలార్డర్లో అత్యంత సీనియర్ ప్లేయర్ అయిన పాండ్యా ఆ స్థాయికి తగ్గట్టు ఆడాల్సి ఉంటుంది. గాయం వల్ల సిరాజ్ తప్పుకోవడంతో బౌలింగ్ వీక్ అయింది. శార్దూల్ రాణిస్తున్నా అతనికి సపోర్ట్ కరువైంది. స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్ సిరీస్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. తన బౌలింగ్లో వేగం మాత్రమే కాదు వికెట్లు తీసే సత్తా ఉందని నిరూపించుకోవాలి. స్పిన్నర్లలో చైనామన్ కుల్దీప్ సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో అతని దోస్త్ చహల్కు టీ20 సిరీస్లోనే బరిలోకి దిగే చాన్సుంది.
విండీస్లో జోష్
నాలుగేండ్ల గ్యాప్ తర్వాత ఇండియాపై తొలి విజయం సాధించడంతో విండీస్ టీమ్లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. వన్డే వరల్డ్ కప్నకు క్వాలిఫై అవ్వలేక డీలా పడ్డ విండీస్ ఈ సిరీస్ గెలిస్తే ఆ జట్టు నైతికబలం పెరగనుంది. ఓడినా పెద్దగా పోయేదేమీ లేదు కాబట్టి మూడో వన్డేలో కరీబియన్లు స్వేచ్ఛగా ఆడనున్నారు. ఇండియా బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్న లెఫ్టార్మ్ స్పిన్నర్ మోతీ, పేసర్ షెఫర్డ్తో పాటు కెప్టెన్ షై హోప్ ఈ మ్యాచ్లోనూ కీలకం కానున్నాడు.