న్యూఢిల్లీ: వచ్చే ఏప్రిల్ నుంచి ఇండియాలో యూరో–6 కంప్లయెంట్ పెట్రోల్, డీజిల్ వాడకంలోకి రానున్నాయి. ఇప్పటిదాకా మనం వాడుతున్నవి యూరో–4 గ్రేడ్ ఫ్యూయెల్స్. యూరో–4 నుంచి నేరుగా యూరో–6 కి ఇండియా జంప్ చేస్తోంది. గ్లోబల్గా పెద్ద ఎకానమీలలో ఎక్కడా ఇలా జరగకపోవడం విశేషం. అత్యంత తక్కువ సల్ఫర్ ఉండే పెట్రోల్, డీజిల్లు మనకు అందుబాటులోకి రానున్నాయి. పెట్రోల్, డీజిల్లో సల్ఫర్ ఎంత తక్కువ ఉంటే వెహికిల్స్ కాలుష్యం అంత తక్కువగా ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాలన్నీ తీవ్రమైన పొల్యూషన్ సమస్య ఎదుర్కొంటున్నాయి. వెహికిల్స్ సంఖ్య పెరగడంతోపాటు, ఇంధనాల్లో సల్ఫర్ పరిమాణం ఎక్కువగా ఉండటమే పొల్యూషన్కు కారణమవుతోంది. ప్రధాన రిఫైనరీలన్నీ 2019 చివరి నుంచే లో సల్ఫర్ ఫ్యూయెల్ను ఉత్పత్తి చేస్తున్నాయని, బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఛైర్మన్ సంజీవ్ సింగ్ వెల్లడించారు. ఇండియా ఫ్యూయెల్ మార్కెట్లో సగం వాటా ఐఓసీదే. కొత్తగా ఉత్పత్తయ్యే ప్రతి ఇంథనపు చుక్కా బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణమైనదేనని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 ఫ్యూయెల్ సప్లై చేయడానికి తాము అన్ని విధాల సిద్ధమయ్యామని, ఈ సప్లై ఇప్పటికే మొదలైందని దేశంలో ఉన్న స్టోరేజ్ డిపోలకూ చేరుస్తున్నామని పేర్కొన్నారు. ఆ స్టోరేజ్ డిపోల నుంచి పెట్రోల్, డీజిల్ పెట్రోల్ పంపులను చేరుకుంటుందని చెప్పారు. దీంతో బీఎస్–6 కంప్లయెంట్ పెట్రోల్ వెహికిల్స్లోనైతే 25 శాతం, డీజిల్ వెహికిల్స్లోనైతే 70 శాతం పొల్యూషన్ తగ్గుతుంది. మన ఫ్యూయెల్కు యూఎస్, యూరప్ కూడా సాటి కాదు
