IND vs WI 1st Test: తిరుగులేని టీమిండియా.. విండీస్‌పై తొలి రోజే పట్టుబిగించిన గిల్ సేన

IND vs WI 1st Test: తిరుగులేని టీమిండియా.. విండీస్‌పై తొలి రోజే పట్టుబిగించిన గిల్ సేన

వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజును టీమిండియా ఘనంగా ముగించింది.  గురువారం (అక్టోబర్ 2) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైన ఈ టెస్టులో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటింది. మొదట బౌలింగ్ లో చెలరేగి వెస్టిండీస్ ను 162 పరుగులకే ఆలౌట్ చేసిన గిల్ సేన.. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ రాణించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (53), కెప్టెన్ శుభమాన్ గిల్ ((18) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 41 పరుగులు వెనకబడి ఉంది. విండీస్ బౌలర్లలో సీల్స్, ఛేజ్ తలో వికెట్ తీసుకున్నారు. 

టీ విరామం తర్వాత రెండో సెషన్ ప్రారంభించిన ఇండియాకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జైశ్వాల్, రాహుల్ ఆచితూచి ఆడారు. జైశ్వాల్ పూర్తిగా డిఫెన్స్ కే పరిమితం కాగా.. రాహుల్ అపుడప్పుడు బౌండరీలు కొడుతూ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. దీంతో తొలి 10 ఓవర్లలో ఇండియా వికెట్ కోల్పోకుండా 23 పరుగులు చేసింది. 15 ఓవర్లో మూడు బౌండరీలు బాదిన జైశ్వాల్ వేగంగా ఆడడం మొదలు పెట్టాడు. మరో ఎండ్ లో రాహుల్ కూడా బౌండరీల వర్షం కురిపించడంతో ఇండియా స్కోర్ వేగంగా ముందుకు వెళ్ళింది. 

తొలి వికెట్ కు 68 పరుగులు జోడించిన తర్వాత 36 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జైశ్వాల్ ఔటయ్యాడు. జైడెన్ సీల్స్ వేసిన ఆఫ్ కట్టర్ ను కట్ చేయబోయి వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి జైశ్వాల్ ఔటయ్యాడు. ఆ తర్వాత మూడో స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్ నిరాశపరిచాడు.    19 బంతుల్లో 7 పరుగులే చేసి ఛేజ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ దశలో కెప్టెన్ గిల్ తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో రాహుల్ తన హాఫ్ సెంచరీ పూర్తి  చేసుకున్నాడు. చివరి అరగంట వికెట్ పడకుండా గిల్, రాహుల్ రోజును ముగించారు. 

అంతకముందు టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ తీసుకోవాలనే నిర్ణయం బెడిసి కొట్టింది. గ్రీన్ వికెట్ పై టీమిండియా పేసర్లు సిరాజ్, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశారు. టాగెనరైన్ చంద్రపాల్ వికెట్ తీసుకొని సిరాజ్ టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. 20 పరుగుల వద్ద జాన్ కాంప్‌బెల్ ను బుమ్రా ఔట్ చేయడంతో విండీస్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ దశలో కొన్ని ఓవర్ల పాటు విండీస్ జట్టు సహనంగా ఆడింది. అయితే మహమ్మద్ సిరాజ్ ఈ సారి విండీస్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. వరుస ఓవర్లలో బ్రాండన్ కింగ్, అలిక్ అథనాజ్ లను పెవిలియన్ కు పంపి విండీస్ జట్టును కష్టాల్లో పడేశాడు.

39 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన వెస్టిండీస్ జట్టును కెప్టెన్ రోస్టన్ ఛేజ్, షాప్ హోప్ ఆదుకున్నారు. 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పర్వాలేదనిపించారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లంచ్ బ్రేక్ కు ముందు బిగ్ షాక్ ఇచ్చాడు. మంచి టచ్ లో కనిపించిన షాయ్ హోప్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు.  5 వికెట్ల నష్టానికి 90 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన వెస్టిండీస్ తమ చివరి ఐదు వికెట్లను 72 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. తొలి సెషన్ లో సూపర్ స్పెల్ తో ఆకట్టుకున్న సిరాజ్.. రెండో సెషన్ తొలి స్పెల్ లో ఒక అద్భుతమైన డెలివరీతో కెప్టెన్ రోస్టన్ ఛేజ్ ను ఔట్ చేశాడు.

ఈ దశలో జస్టిన్ గ్రీవ్స్, ఖారీ పియరీ స్వల్ప భాగస్వామ్యంతో విండీస్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్ కు 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి కాసేపు వికెట్ల పతనాన్ని ఆపారు. కాసేపు విసుగు తెప్పించిన ఈ జోడీని ఎట్టకేలకు సుందర్ విడగొట్టాడు. ఖారీ పియరీ (11) ని ఔట్ చేసి ఇండియాకు ఏడో వికెట్ అందించాడు. టైలండర్ పనిని బుమ్రా చూసుకున్నాడు. ఒక స్టన్నింగ్ యార్కర్ తో జస్టిన్ గ్రీవ్స్ (32) క్లీన్ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్లోనే జోహన్ లేన్ (1) ను మరొక అద్భుత యార్కర్ తో పెవిలియన్ కు పంపాడు. కుల్దీప్ చివరి వికెట్ తీసుకొని విండీస్ కథను ముగించాడు.