నిజామాబాద్ జిల్లా ఊట్పల్లిలో విషాదం.. కరెంట్ షాక్తో భార్యాభర్త మృతి

నిజామాబాద్ జిల్లా ఊట్పల్లిలో విషాదం.. కరెంట్ షాక్తో భార్యాభర్త మృతి

బోధన్, వెలుగు: కరెంట్ షాక్ తో దంపతులు చనిపోయారు. ఈ ఘటన నిజామాబాద్​జిల్లా బోధన్ మండలం ఊట్ పల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రత్నావత్ సంజీవ్ (46), జ్యోతి(44) భార్యాభర్తలు. జ్యోతి ఆదివారం రాత్రి ఇంటి పక్కన వైర్పై ఆరేసిన దుస్తులు తీసేందుకు ప్రయత్నించగా.. షాక్ కొట్టింది. 

దీంతో ఈ విషయాన్ని భర్త సంజీవ్ కు తెలిపింది. అతడు బయటకు వెళ్లి వైర్ను పట్టుకోవడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే పడిపోయాడు. గమనించిన జ్యోతి భర్తను కాపాడే ప్రయత్నంలో అతడి చేతిలో ఉన్న తీగను పట్టుకొని పక్కకు తీసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమెకు కూడా షాక్ కొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పెద్ద కూతురు గోదావరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.