
ముంబై: క్రికెట్ మ్యాచ్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. కరోనా కారణంగా రెండున్నర నెలలు ఆటకు దూరంగా ఉన్న టీమిండియా తొందర్లోనే స్టేడియంలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆగస్ట్లో టీమిండియా.. శ్రీలంకలో పర్యటించడం దాదాపుగా ఖాయమైంది. మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సిరీస్కు సంబంధించి సోమవారమే శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) కూడా సమాచారం ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అదే క్రమంలో లంక టూర్కు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ను కోరినట్లు కూడా తెలుస్తోంది. ఎఫ్టీపీ ప్రకారం ఈ టూర్ను జూన్లో షెడ్యూల్ చేశారు. కానీ కరోనా కంట్రోల్ కాకపోవడంతో ఈ బైలేటరల్ సిరీస్ను ఆగస్ట్కు రీ షెడ్యూల్ చేశారు.
దీంతో సిరీస్ కోసం పర్మిషన్ ఇవ్వాలని లంక కూడా తమ స్పోర్ట్స్ మినిస్ట్రీని కోరనుంది. కరోనా నేపథ్యంలో తమ దేశంలో విధించిన ఆంక్షలను త్వరలోనే ఎత్తి వేస్తారని, ఆగస్ట్లోపు టూరిజం కూడా మొదలవుతుందని లంక బోర్డు భావిస్తోంది. దీంతో ఇండియాతో సిరీస్కు కచ్చితంగా అనుమతి వస్తుందని పూర్తి ధీమాతో ఉంది. ఈ సిరీస్ జరిగితే టెలివిజన్ రైట్స్ ద్వారా ఎస్ఎల్సీకి భారీ ఆదాయం సమకూరుతుంది. ఫలితంగా ఇప్పుడు ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడొచ్చని గంపెడాశలు పెట్టుకుంది. పాత షెడ్యూల్ ప్రకారమే వేదికలు ఉంటాయని లంక బోర్డు సభ్యుడు ఒకరు తెలిపారు.
‘ఆసియా’కు లైన్ క్లియర్ కోసం..
ఈ సిరీస్ను నిర్వహించడం ద్వారా ప్రతిష్టాత్మక ఆసియా కప్ టీ20 టోర్నీకి లైన్ క్లియర్ చేసుకోవాలని లంక బోర్డు భావిస్తోంది. ఈ ఏడాది ఆసియా కప్ కోసం పాకిస్థాన్ ప్లేస్లో లంక హోస్టింగ్ రైట్స్ను దక్కించుకుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఎస్ఎల్సీ ప్రెసిడెంట్ షమ్మీ సిల్వా మీడియాతో చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ పాక్లో జరగాల్సి ఉంది. కానీ ఇండియా రాదనే ఉద్దేశంతో దానిని యూఏఈకి తరలించారు. మరోవైపు 2022 ఆసియా కప్ ఆతిథ్య హక్కులు లంక వద్ద ఉన్నాయి. అయితే ఈ రెండు టోర్నీలను స్వైప్ చేసుకుందామని పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి ఆఫర్కు లంక బోర్డు అంగీకరించింది. దీంతో ఈ ఏడాది ఆసియాకప్ లంకలో జరుగనుండగా, 2022 టోర్నీకి పాక్ హోస్టింగ్ ఇవ్వనుంది.