
- 43 శాతం మంది హెచ్ఎన్ఐల పొదుపు తక్కువే.. వెల్లడించిన తాజా రిపోర్ట్
న్యూఢిల్లీ: మనదేశంలోని అత్యధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్ఎన్ఐలు) భారీగానే సంపాదిస్తున్నా తగినంత పొదుపు చేయడం లేదని వెల్లడయింది. వీరికి ఆర్థిక క్రమశిక్షణ, ప్లానింగ్ కొరవడిందని మార్సెలస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్, డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్తో కలిసి బుధవారం విడుదల చేసిన కొత్త సర్వే వెల్లడించింది. 28 నగరాల్లోని 465 సంపన్ను కుటుంబాల నుంచి తీసుకున్న వివరాల ఆధారంగా ఇండియా వెల్త్ సర్వే 2025 రిపోర్ట్ తయారు చేసింది.
దీని ప్రకారం, 43శాతం మంది హెచ్ఎన్ఐలు తమ పన్ను అనంతర ఆదాయంలో 20శాతం కంటే తక్కువే ఆదా చేస్తున్నారు. ముందస్తు రిటైర్మెంట్, బిజినెస్, తమ పిల్లల ఆర్థిక భద్రతకు వీళ్లు ఎక్కువ ఇంపార్టెన్స్ఇస్తున్నారు. అంతేకాకుండా, 14శాతం మంది రెస్పాండెంట్లకు అత్యవసర నిధి లేదు. వీరిలో సగం మందికి పైగా తమ సంపదలో 20శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని రియల్ఎస్టేట్లో పెడుతున్నారు. మార్కెట్-అనుసంధాన పెట్టుబడుల గురించి అవగాహన పెరుగుతున్నప్పటికీ స్థిరాస్తులకే మొగ్గుచూపుతున్నారు. మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.3 కోట్లు)కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారినిహెచ్ఎన్ఐలు అంటారు.
లక్ష్యాలు భారీగానే ఉన్నా...
హెచ్ఎన్ఐలు సంపద విషయంలో భారీ లక్ష్యాలను పెట్టుకుంటున్నారు కానీ ఆచరణలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. 82శాతం మంది తగినంత డబ్బును అసెట్ డైవర్సిఫికేషన్కు కేటాయించడం లేదు. ఈక్విటీల వంటి ఆస్తుల్లో పెద్దగా ఇన్వెస్ట్ చేయడం లేదు. రూ. 10 కోట్లకు పైగా నికర విలువ కలిగిన కుటుంబాలలో 63శాతం మంది తమ ఆదాయంలో 30శాతం కంటే ఎక్కువ ఆదా చేస్తున్నారు. అయినప్పటికీ 17శాతం మంది మాత్రమే 30శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని ఈక్విటీలకు కేటాయిస్తున్నారు. 48శాతం మంది 30శాతం కంటే ఎక్కువ స్థిరాస్తుల్లో పెట్టుబడి పెడుతున్నారు. 65శాతం మంది 10-–20శాతం మొత్తాన్ని బంగారం, వెండికి కేటాయిస్తున్నారు.
రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి తమకు అవగాహన ఉందని 76శాతం మంది అల్ట్రా-హెచ్ఎన్ఐలు చెప్పారు. అయినప్పటికీ చాలా మంది రిటైర్మెంట్సంబంధిత స్కీముల్లో పెద్దగా ఇన్వెస్ట్ చేయడం లేదు. 51శాతం మంది హెచ్ఎన్ఐలు అసెట్డైవర్సిఫికేషన్లో తమకు మరింత సహాయం కావాలని, 38శాతం మంది వ్యక్తిగతీకరించిన పెట్టుబడులను కోరుకుంటున్నారని, 32శాతం మంది గోల్ప్లానింగ్సపోర్ట్ కోసం చూస్తున్నారని ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఈ విషయమై మార్సెలస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ కో–ఫౌండర్ ప్రమోద్ గుబ్బి మాట్లాడుతూ, హెచ్ఎన్ఐలు తమ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రొఫెషనల్స్సాయం తీసుకోవడం పెరిగిందని అన్నారు.