చెన్నై: ఎఫ్ఐహెచ్ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్లో ఇండియా కాంస్య పతకంతో మెరిసింది. బుధవారం మూడో ప్లేస్కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో ఇండియా 4–2తో అర్జెంటీనాపై నెగ్గింది. అంకిత్ పాల్ (49వ ని), మన్మిత్ సింగ్ (52వ ని), శ్రద్ధానంద్ తివారీ (57వ ని), అన్మోల్ ఎక్కా (58వ ని) ఇండియాకు గోల్స్ అందించారు. అర్జెంటీనా తరఫున నికోలస్ రోడ్రిగ్జ్ (3వ ని), శాంటియాగో ఫెర్నాండేజ్ (44వ ని) గోల్స్ కొట్టారు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన అర్జెంటీనా.. ఇండియా డిఫెన్స్పై మెరుపు దాడులు చేసింది.
ఫలితంగా తొలి క్వార్టర్లోనే పెనాల్టీ కార్నర్ను సాధించింది. దీన్ని రోడ్రిగ్జ్ షార్ట్ కార్నర్ నుంచి అద్భుతంగా గోల్ పోస్ట్లోకి పంపాడు. ఇక్కడి నుంచి స్కోరును సమం చేసేందుకు ఇండియా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో 0–1తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. అయితే మూడో క్వార్టర్లో మరింత వ్యూహాత్మకంగా ఆడిన అర్జెంటీనా షార్ట్ పాస్లతో ఇండియాపై ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలో ఫెర్నాండెజ్ లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి గోల్ కొట్టి ఆధిక్యాన్ని 2–0కు పెంచాడు.
ఫలితంగా తీవ్ర ఒత్తిడికి లోనైన ఇండియా ఎదురుదాడులకు దిగింది. బంతిని ఎక్కువగా ఆధీనంలో ఉంచుకుని లాంగ్ పాస్లతో దూసుకెళ్లింది. దాంతో చివరి క్వార్టర్లో లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మల్చడంతో స్కోరు 2–2తో సమమైంది. అయినప్పటికీ ఇండియా దాడులను మాత్రం ఆపలేదు.
57వ నిమిషంలో తివారీ సూపర్గా ఫీల్డ్ గోల్ చేసి లీడ్ను 3–2కు పెంచాడు. చివరి క్షణాల్లో అర్జెంటీనా గోల్ కీపర్ను బయటకు రప్పించి ఇండియా పెనాల్టీ కార్నర్ను సాధించింది. మ్యాచ్ ముగియడానికి రెండు నిమిషాల ముందు దీన్ని అన్మోల్ నేర్పుగా గోల్ పోస్ట్లోకి పంపి ఇండియాకు కాంస్యాన్ని అందించాడు. మరోవైపు చిలీలో జరుగుతున్న విమెన్స్ జూనియర్ వరల్డ్ కప్లో ఇండియా 3–1తో (షూటౌట్) ఉరుగ్వేపై నెగ్గింది.

