- ఇండియాకు చెక్
- ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీ
రాంచీ: పారిస్ ఒలింపిక్స్కు క్వాలిఫై కావాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఇండియా విమెన్స్ హాకీ టీమ్ నిరాశపర్చింది. గురువారం జరిగిన ఎఫ్ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్ సెమీఫైనల్లో ఇండియా 3–4 (షూటౌట్)తో జర్మనీ చేతిలో ఓడింది.
ఆట ఆరంభం నుంచి ఇరుజట్ల ప్లేయర్లు అటాకింగ్కు దిగడంతో రెగ్యులర్ టైమ్లో ఇండియా, జర్మనీ 2–2తో సమంగా నిలిచాయి. ఇండియా తరఫున దీపిక (15వ ని.), ఇషికా చౌదరీ (59వ ని.) గోల్స్ చేయగా, చార్లెట్టీ స్టెఫాన్హార్స్ట్ (27వ, 57వ ని.) జర్మనీకి రెండు గోల్స్ అందించింది. స్టార్టింగ్లో ఇండియా షార్ట్ పాస్లతో ప్రత్యర్థి సర్కిల్లోకి దూసుకుపోయేందుకు ప్రయత్నించింది.
కానీ బలమైన జర్మనీ డిఫెన్స్ దీన్ని దీటుగా అడ్డుకుంది. తొలి క్వార్టర్కు 15 సెకన్ల ముందు వచ్చిన పెనాల్టీని దీపిక గోల్గా మల్చింది. దీని నుంచి తొందరగానే తేరుకున్న జర్మనీ మరో 12 నిమిషాల్లోనే గోల్ కొట్టింది.
తర్వాత ఇరుజట్లు చెరో గోల్ చేయడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్కు దారితీసింది. షూటౌట్లో సవితా రెండుసార్లు బాల్ను అడ్డుకున్నా.. నవ్నీత్ కౌర్, నేహా గోయల్, సంగీతా కుమారి, సోనికా టార్గెట్ను మిసయ్యారు. ఈ విజయంతో జర్మనీకి పారిస్ బెర్త్ కన్ఫామ్ కాగా, శుక్రవారం మూడో ప్లేస్ కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో ఇండియా.. జపాన్తో తలపడనుంది. ఇందులో నెగ్గితే టీమిండియాకు ఒలింపిక్ బెర్త్ దక్కుతుంది.