
హాంగ్జౌ (చైనా): ఆసియా కప్లో ఇండియా విమెన్స్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. గురువారం జరిగిన సూపర్–4 మ్యాచ్లో చైనా 4–1తో ఇండియాపై గెలిచింది. ముంతాజ్ ఖాన్ (38వ ని) ఇండియాకు ఏకైక గోల్ అందించింది. జో మిరాంగ్ (4, 56వ ని), చెన్ యాంగ్ (31వ ని), జిన్జిహుంగ్ (47వ ని) చైనా తరఫున గోల్స్ కొట్టారు. ఫినిషింగ్లో ఇబ్బందిపడ్డ ఇండియా మూడు పెనాల్టీ కార్నర్లను వృథా చేసుకుంది. తొలి క్వార్టర్లో రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే నాలుగో నిమిషంలో లభించిన పెనాల్టీని చైనా రీ బౌండ్ ద్వారా గోల్గా మలిచింది.
10వ నిమిషంలో లభించిన పెనాల్టీని ఇండియా గోల్గా మల్చలేకపోయింది. రెండో క్వార్టర్లో ఇరుజట్లు అద్భుతంగా ఆడాయి. కానీ 27వ నిమిషంలో మరో పెనాల్టీని ఇండియా వృథా చేసింది. మూడో క్వార్టర్ తొలి నిమిషంలోనే చైనా గోల్ కొట్టింది. అయితే 38వ నిమిషంలో ముంతాజ్ ఫీల్డ్ గోల్ చేసి ఆధిక్యాన్ని తగ్గించినా చైనా దూకుడును అడ్డుకోలేకపోయారు. చివర్లో మరింత వేగంగా ఆడిన చైనీయులు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. శుక్రవారం జరిగే మ్యాచ్లో ఇండియా... జపాన్తో తలపడుతుంది.