
ఇంగ్లండ్ విమెన్స్ జట్టుపై తొలి టీ20 సిరీస్ విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య నేడు మూడో టీ20 జరగనుంది. సూపర్ ఫామ్లో ఉన్న హర్మన్సేన తొలి రెండు మ్యాచ్ల్లో వరుసగా 97, 24 రన్స్ తేడాతో గెలిచింది. దాంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2–0 లీడ్లో నిలిచింది. 2006లో డెర్బీలో జరిగిన ఏకైక మ్యాచ్లో ఇండియా.. ఇంగ్లండ్ను ఓడించింది. అప్పట్నించి ఇంగ్లండ్తో ఇంటా, బయటా జరిగిన ప్రతీ టీ20 సిరీస్లోనూ ఇండియా విఫలమైంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఇండియా అన్ని రంగాల్లో అద్భుతంగా ఆడింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, హర్లీన్ డియోల్ బ్యాటింగ్లో కీలక పాత్ర పోషించారు.
సెకండ్ మ్యాచ్లో అమన్జోత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి బిగ్ హిట్టర్ షెఫాలీ వర్మపై పడింది. రెండు మ్యాచ్ల్లో 20, 3 రన్స్కే పరిమితమైన ఆమె ఓ భారీ ఇన్నింగ్స్తో తన రీ ఎంట్రీని ఘనంగా చాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. పేసర్లు రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ లేకపోయినా బౌలింగ్ దాడి బాగా మెరుగుపడింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీచరణి ఈ సిరీస్లో స్టార్ ప్లేయర్గా అవతరించింది. అత్యుత్తమ ఎకనామీ (5.11)తో ఆరు వికెట్లు తీసింది. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన ఇంగ్లండ్ ప్రతీకారంపై దృష్టి పెట్టింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ చేజారకుండా చూసుకోవాలని లెక్కలు వేస్తోంది. అయితే ఓపెనర్లు సోఫియా డంక్లే, వ్యాట్ హాడ్జ్ అనుకున్న స్థాయిలో శుభారంభాన్నివ్వలేకపోతున్నారు. ఇంగ్లిష్ బౌలింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఒక్కరు కూడా అంచనాలను అందుకోలేకపోతున్నారు.