గాంధీ నగర్: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా ఇండియాతో జరుగుతోన్న మ్యాచులో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో డేవిడ్ మిల్లర్ (63) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డేవాల్డ్ బ్రేవిస్ (45) రాణించాడు. దీంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా.. అర్షదీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో భారత్ ఛేజింగ్ మొదలు పెట్టింది.
ఈ మ్యాచులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికాకు భారత బౌలర్ల బుమ్రా, అర్షదీప్ ఆదిలోనే బిగ్ షాక్ ఇచ్చారు. ఇన్సింగ్స్ సెకండ్ ఓవర్ చేసిన బుమ్రా ఒక ఫోర్ కొట్టి దూకుడు మీదున్న ఓపెనర్ డికాక్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ మార్క్రమ్ అర్షదీప్ బౌలింగ్లో దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. మార్క్రమ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రికెల్టన్ అర్షదీప్ బౌలింగ్లో భారీ సిక్స్ కొట్టి మంచి టచ్లో కనిపించాడు.
కానీ ఆ తర్వాత ఓవర్లనే రికెల్టన్ బుమ్రా బౌలింగ్లో క్యాచ్ ఔటై నిరాశగా వెనుదిరిగాడు. 5 ఓవర్లలోనే కెప్టెన్ మార్క్రమ్, డికాక్, రికెల్టన్ మూడు కీలక వికెట్లు పడగొట్టి ప్రొటిస్ను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ దశలో జతకట్టిన బ్రేవిస్ (45), మిల్లర్ (63) ఇండియా బౌలర్లను ఆటాడుకున్నారు. ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ చెలరేగి ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని ఫోర్లు, సిక్సుల వర్షం కురిపించారు.
దీంతో 13 ఓవర్లు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 128/4తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో శివమ్ దూబే ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగుతోన్న బ్రేవిస్ (45)ను అవుట్ చేశాడు. దీంతో స్టబ్స్, మిల్లర్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని మరింత ప్రమాదకరంగా మారుతోన్న మిల్లర్ను చక్రవర్తి ఔట్ చేశాడు. చివర్లో స్టబ్స్ (44) మూడు సిక్సులు, ఒక ఫోర్తో మెరుపులు మెరిపించి సౌతాఫ్రికాకు భారీ స్కోర్ అందించాడు.
