మనదేశ భూభాగంలోకి వచ్చిన పాకిస్థాన్ ఎఫ్16 యుద్ధ విమానాన్ని వింగ్ కమాండర్ అభినందర్ వర్ధమాన్ వెంబడించి కూల్చడం, ఆయన నడిపిస్తున్న మిగ్ 21 కూలి పాక్ భూభాగంలో పడిపోవడం, పాక్ ఆర్మీకి అభినందన్ చిక్కడం, తర్వాత ఆయన్ను పాక్ అప్పగించడం తెలిసిందే. అచ్చం ఇలాంటి సంఘటనే సుమారు 60 ఏళ్ల కిందట జరిగింది. 1959లో ఇండియాకు చెందిన ఓ యుద్ధవిమానం అనుకోకుండా పాక్ గగన తలంలోకివెళ్లింది. గమనించిన పాక్ .. దాన్ని కూల్చి ఇద్దరు పైలట్లను పట్టుకుంది. వాళ్లను తిరిగి ఇండియాకు అప్పగించింది.
ఆ రోజు ఈద్
1959 ఏప్రిల్ 10. ఆ రోజు ఈద్. చాలా మంది పాకిస్థాన్ ఏఎఫ్ అధికారులు, సిబ్బందికి సెలవు. పెళ్లి కానివాళ్లు, నిఘా అధికారులే విధుల్లో ఉన్నారు. వాళ్లలో కోబ్రా యూనిట్కు చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్లు మహ్మద్ యునిస్, నసీర్ భట్ ఉన్నారు. పెషావర్లో విధులు నిర్వహిస్తున్నారు. పని చేస్తూ చేస్తూ కాసేపటికి టీ తాగడానికని కూర్చున్నారు. వెంటనే రాడార్ ఆపరేటర్ పైలట్ ఆఫీసర్ రబ్ నవాజ్ ఓ అనౌన్స్మెంట్ చేశాడు. ఇండియన్ ఎయిర్ స్పేస్ నుంచి ఎవరో పాక్ భూభాగంలోకి వస్తున్నారని చెప్పా డు. ఆ మధ్యే పాకిస్థాన్కు అమెరికా ఇచ్చిన ఎఫ్ 86 ఎఫ్ సాబ్రే 55–005 తీసుకొని ఇద్దరూ గగనతలంలోకి ఎగిరారు. పాక్విమానాలు 20 వేల అడుగుల ఎత్తులో ఉన్నపుడు రెండు విమానాలు వస్తున్నట్టు కనిపించాయి. 41వేలఅడుగుల ఎత్తుకు వెళ్లాక ఒకే విమానం వస్తున్నట్టు స్పష్టంగా తెలిసింది. గుజరాత్ దగ్గరకు రాగానే అది 50వేల అడుగుల ఎత్తులో ఉన్నట్టు కనిపించింది.
కాన్ బెర్రాపై బులెట్ల వర్షం
విమానం కనబడగానే యూనిస్ కాల్చమని చెప్పాడు. నసీర్కు అర్థం కాలేదు. కాల్చాలా? లేక పై నుంచి పర్మిషన్ తీసుకోవాలా అనుకున్నాడు. పైగా ఆ విమానం గురిపెట్టేంత దూరంలోనూ లేదు. అలా అనుకుంటుండగానే ఇండియన్ విమానం కుడివైపుకు తిరిగి వెనక్కిమళ్లింది. త్వరత్వరగా కిందికి దిగుతున్నట్టు కనిపించింది. వెంటనే విమానం కుడి ఇంజిన్కు యూనిస్ గురిపెట్టాడు. బులెట్ల వర్షం కురిపించాడు. 1,200రౌండ్లు కాల్చాడు. ఆ దెబ్బకు ‘కాన్బెర్రా’ గింగిరాలు తిరిగింది. కిందపడిపోయింది. అందులోని పైలట్ స్వ్కాడ్రన్ లీడర్ జేసీ సేన్గుప్తా, నా విగేటర్ ఫ్లైట్ లెఫ్టినెంట్ ఎస్ఎన్ రాంపాల్లు జాగ్రత్తగానే కిందికిదిగారు. వాళ్లను పాక్ కస్టడీలోకి తీసుకుంది. అయితే తర్వాత రోజే తిరిగి ఇండియాకు అప్పగించింది. తర్వాత ఘటన గురించి వాళ్లు వివరించారు. తాము చాలా ఎత్తులో ఉండటంతో ఆక్సిజన్ సమస్య వచ్చిందని, దీంతో తక్కువ ఎత్తులో నడపాలని నిర్ణయించుకున్నామని వివరించారు. ఆ సమయంలోనే పాక్ చేతికి చిక్కా మని చెప్పారు . స్క్వాడ్రన్ లీడర్ సేన్గుప్తా1976లో గ్రూప్ కెప్టెన్గా రిటైర్ అయ్యారు. రాంపాల్ 1971లో వింగ్ కమాండర్గా పదవీ విరమణపొందారు.
ఇండియన్ సర్కారు ఏమంది?
ఘటన జరిగిన ఓ రోజు తర్వాత 1959 ఏప్రిల్ 11నలోక్ సభలో ఈ విషయంపై అప్పటి రక్షణ మంత్రి వీకేకృష్ణన్ మాట్లాడారు. హిమాచల్, జమ్మూ కాశ్మీర్లలో ఏరియల్ ఫొటోలు తీస్తుండగా విమానం దారితప్పిందని చెప్పారు. విమానం చాలా ఎత్తులో ప్రయాణిస్తోందని, ఆ ఎత్తులో నావిగేషన్ సమస్యలు వస్తాయని వివరిం చారు. అందుకే విమానం పాక్ ఎయిర్ స్పేస్లోకి వెళ్లిందన్నారు. పాక్ నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకుండానే దాడి చేసినట్టు అర్థమవుతోందనిచెప్పారు . ఈ చర్య అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనన్నారు.