
భారతదేశంలో ప్రజల ఆకాంక్షలు, అవసరాలతో పాటు వారి పొదుపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. భారతీయ కుటుంబాలు డబ్బును పొదుపు చేయటానికి ఒకప్పుడు ప్రసిద్ధి కానీ ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతూ సేవింగ్స్ అనే మాటకు చూలా దూరంగా గడుపుతున్నారని వెల్లడైంది.
కేర్ ఎడ్జ్ సంస్థ తాజా నివేదికలో వరుసగా మూడో ఏడాది కూడా భారతీయ కుటుంబాల పొదుపు తగ్గినట్లు నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో పొదుపు శాతం 18.1కి తగ్గినట్లు నివేదించబడింది. 2015 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 32.2 శాతంగా ఉన్న స్థూల పొదుపు.. గడచిన ఆర్థిక సంవత్సరం 30.7 శాతానికి దిగజారింది. దీనికి ప్రధాన కారణంగా భారతీయ కుటుంబాల సేవింగ్స్ తగ్గటమేనని కేర్ ఎడ్జ్ స్పష్టం చేసింది.
దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటానికి ప్రజలు చేపట్టే పెట్టుబడులు, పొదుపులు చాలా ముఖ్యమైనవి. కానీ ప్రస్తుతం ప్రజల్లో దాచుకునే గుణం తగ్గిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితులు దీర్ఘకాలిక పరిణామాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో 2024 ఆర్థిక సంవత్సరంలో మరోపక్క భారతీయ కుటుంబాల స్థూల రుణాలు 6.2 శాతం పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది.
వాస్తవానికి ప్రజలు ఖర్చు చేయకుండా పక్కన పెట్టిన డబ్బు దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి చాలా కీలకం. అలాగే దేశ అవసరాలకు అనుగుణంగా ఆ డబ్బును పెట్టుబడి పెట్టడం, వినియోగించటం ద్వారా ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధిని సాధిస్తుంది. కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
పొదుపు విషయంలో నగరాల కంటే గ్రామీణ భారతం కొంత మెరుగ్గా ఉన్నట్లు వెల్లడైంది. అలాగే ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతోందని నివేదించబడింది. ఏప్రిల్ మాసంలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.2 శాతానికి తగ్గినప్పటికి వంటనూనెల ధరలు, పండ్ల ధరలు మాత్రమే అధికంగా కొనసాగుతున్నట్లు వెల్లడైంది. దీనికి తోడు ఇటీవల రిజర్వు బ్యాంక్ తన కీలక వడ్డీ రేట్లను భారీగా తగ్గించటం కూడా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటానికి దారితీస్తోందని వెల్లడైంది.