మేధో వలసను ఆపాలి

మేధో వలసను ఆపాలి

ప్రపంచస్థాయి ఇంజనీరింగ్ సాంకేతిక విద్య కు చిరునామాగా భారతీయ ఐఐటీలు భాసిల్లుతున్నాయి. భవిష్యత్తు భారతానికి కావల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో భారతీయ ఐఐటీల పాత్ర మరువలేనిది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు సీఈవోలను, దేశానికి శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను, రాజకీయ నాయకులను అందించిన ఘనత ఐఐటీలకే దక్కుతుంది. స్వాతంత్ర్యానికి పూర్వమే 1940 సంవత్సరంలో నళిని రంజన్ సర్కార్ అధ్యక్షతన 22 మందితో కూడిన కమిటీ భారత దేశ వ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంజనీరింగ్ విద్యను విద్యార్థులకు అందించే విద్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. స్వాతంత్ర్యానంతరం1950 మే15న భారతదేశంలో మొట్టమొదటి ఐఐటీ హిజ్లి డిటెన్షన్ క్యాంప్ ఖరగ్ పూర్ (పశ్చిమ బెంగాల్) లో ఏర్పాటు చేశారు. దీనిని భారత దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1951 ఆగస్టు 18న అధికారికంగా ప్రారంభించారు.

నళిని రంజన్ సర్కార్ కమిటీ ప్రతిపాదన ప్రకారం దేశవ్యాప్తంగా నాలుగు ఐఐటీలను బాంబే, మద్రాస్, కాన్పూర్, ఢిల్లీలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 15 సెప్టెంబర్1956లో భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జాతి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రపంచ స్థాయి విద్యాలయాలు భారతదేశంలో ఏర్పాటు చేయాలని పార్లమెంటులో చర్చించి చట్టం చేశారు. ప్రస్తుతం భారతదేశంలో 23 ఐఐటీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ పరిధిలో ఐఐటీ కౌన్సిల్ సారథ్యంలో ఇవి పనిచేస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో  రూ.9661.50 కోట్లను ఐఐటీల కోసం కేటాయించారు. ఈ ఐఐటీల్లో  కేవలం17385 మంది విద్యార్థులకు మాత్రమే విద్యను అభ్యసించే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మకమైన ఈ ఐఐటీల్లో చేరడానికి విద్యార్థులు ఐఐటీ  జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణతతో పాటు ఉన్నత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం 11,13 ,325 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. దీన్నిబట్టి ఐఐటీలో సీటు కోసం విద్యార్థుల మధ్య పోటీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం అవుతుంది.

ప్రభుత్వం ఐఐటీ కోచింగ్​ సెంటర్లు పెట్టాలి

దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ పరీక్షల్లో అత్యంత కఠినమైన పోటీపరీక్షగా జేఈఈ అడ్వాన్స్ మెయిన్స్​ను చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో జేఈఈ అడ్వాన్స్ పోటీ పరీక్ష రెండవ స్థానంలో ఉండడం విశేషం. గత కొన్ని సంవత్సరాల్లో  ఐఐటీల్లో చేరే విద్యార్థులను పరిశీలిస్తే 95% మంది విద్యార్థులు కోచింగ్ తీసుకున్న వారు మాత్రమే ఐఐటీల్లో చేరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి దేశంలోని అత్యంత నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అందని ద్రాక్షగా ఉంది. ఉన్నత వర్గాల పిల్లలకు మాత్రమే ఐఐటీ విద్య అందుతున్నదనే విమర్శ కూడా ఉంది. ఎందుకంటే కోచింగ్ సెంటర్లలో లక్షలు వెచ్చిస్తే గానీ విద్యార్థులు ఐఐటీల్లో  చేరే అవకాశం లేదు. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో  ఐఐటీ కోచింగ్ సెంటర్ వెలవడం, వాటిలో  కోచింగ్ కోసం తల్లిదండ్రులు లక్షల్లో ఖర్చు చేయడం జరుగుతున్నది. విద్యార్థుల పై మానసిక ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. పేద విద్యార్థులకు ఐఐటీల్లో చేరడం ఒక కలగానే మిగిలిపోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ప్రభుత్వ అధీనంలోనే విద్యార్థులకు ఐఐటీ జేఈఈ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి అత్యున్నత ప్రతిభ గలిగిన విద్యార్థులకు అవకాశాలు కల్పించేలా చేయడం ఆవశ్యకం. అలాగైతేనే  గ్రామీణ ప్రాంత  విద్యార్థులకు కూడా ఐఐటీల్లో  సీటు పొందే అవకాశం ఉంది.

పెరిగిన జనాభాకు తగ్గట్టు ఐఐటీలు పెరగాలి

గత దశాబ్ద కాలంలో కేవలం7 ఐఐటీలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయడం గమనార్హం. జూన్ 2023 లో భారత ప్రభుత్వం, టాంజానియా ప్రభుత్వం కలిసి భారతదేశం వెలుపల మొట్టమొదటి ఐఐటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇది ఐఐటీ మద్రాస్ కు సాటిలైట్ క్యాంపస్ గా ఉండనుంది.ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన  భారతదేశానికి సరిపడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, నూతన ఆవిష్కరణలను అందించాల్సిన బాధ్యత ఐఐటీల పై ఉంది.  పెరిగిన జనాభా ప్రకారం ఐఐటీలను పెంచాల్సిన ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.

పేదలకు అందుబాటులోకి తేవాలి

1953 నుంచి ఇప్పటివరకు భారతదేశంలోని ఐఐటీల్లో చదివిన వారు దాదాపుగా 25 వేల మంది అమెరికాలో స్థిరపడ్డారని సమాచారం. ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం విజ్ఙాన వలస జరుగుతున్నది. భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే అత్యున్నత  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలంటే ఈ మేధో వలసల్ని నివారించాల్సి ఉంది. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ -2023 ప్రకారం  మొదటి 100 మంది టాప్ ర్యాంకర్లలో 62%,1000 ర్యాంకర్లలో 36% మంది వేరే దేశాలకు వలస వెళుతున్నారు. భారత దేశంలో పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా నూతన ఐఐటీలను ఏర్పాటు చేయాలి. మేధో వలసలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీ ఐఐటీ  కౌన్సిల్, యూజీసీ చైర్మన్, ఐ ఎస్ ఐ ఆర్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలతో ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలి. జాతీయ విద్యా కమిషన్ ను  ఏర్పాటు చేసి దేశంలో నాణ్యమైన విద్యను ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి.

మన ఐఐటీలే మేటి

భారతదేశంలో అత్యంత నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందించడంలో ఐఐటీలు ప్రతిసారి ముందుంటున్నాయి. 2023 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో అత్యున్నత ఇంజనీరింగ్ విద్యను అందించే కళాశాలల్లో మొదటి పది స్థానాల్లో 8 ఐఐటీలకే దక్కాయి. మొదటి మూడు ర్యాంకుల్లో ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ ఉన్నాయి. ఐఐటీ కాన్పూర్ లో  చదివిన విద్యార్థికి సంవత్సరానికి నాలుగు కోట్ల జీతం వచ్చిందంటే ఐఐటీ విద్యార్థులపై కార్పొరేట్ కంపెనీలకు ఉన్న ఆసక్తిని మనం అర్థం చేసుకోవచ్చు. ఐఐటీల్లో చదివే విద్యార్థుల సరాసరి జీతం సంవత్సరానికి 30 నుంచి 40 లక్షల వరకు ఉంటుంది.  మన ఐఐటీల్లో చదివి ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారిలో సుందర్ పిచాయ్, ఎన్ ఆర్ నారాయణమూర్తి, సచిన్ బన్సాల్, పరాగ్ అగర్వాల్ తదితర ప్రముఖులు, రాజకీయ నాయకుల్లో అజిత్ సింగ్, మనోహర్ పరికర్, జయరాం రమేష్, అలోక్ అగర్వాల్, జయంత్ సిన్హా, అరవింద్ కేజ్రీవాల్​ లాంటి వారు ఉన్నారు.

 పాకాల శంకర్ గౌడ్