ఇండియన్ కంగారూలు

ఇండియన్ కంగారూలు

కంగారూ.. ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే జంతువు. అయితే వేల ఏళ్ల కిందట ఇండియాలోనూ కంగారూలు ఉన్నాయట.  అది కూడా మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​లో బతికాయట. ఏపీలోని కర్నూలు జిల్లా జ్వాలాపురం. చారిత్రక ఆనవాళ్లు లభించిన, లభిస్తున్న ప్రాంతం. దీనికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల్లో దశాబ్దం కిందట పర్యటించారు చెన్నైకి చెందిన ఆర్కియాలజిస్ట్ జిను కోషి. అప్పట్లో అక్కడ జరిపిన తవ్వకాల్లో కొన్ని పురాతన వస్తువులు, జంతువుల అవశేషాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఆయన మళ్లీ అక్కడికి వెళ్లారు. అక్కడ ఓ రాక్ షెల్టర్‌ను గమనించారు. లోపలికెళ్తే అందులో కేవ్ పెయింటింగ్స్ ఉన్నాయి. ‘‘అదో పెద్ద రాక్​షెల్టర్. వేలాది చిత్రాలతో కూడిన రాక్​ఆర్ట్ అందులో ఉంది. జింక జాతులు, పశువులు, పందులు, మనుషులు, కొన్ని సింబల్స్ రాతిపై వేసి ఉన్నాయి. వాటిని చూడగానే మరింత రీసెర్చ్ చేయొచ్చని భావించా” అని కోషి వివరించారు. కోషి, ఆయన స్టూడెంట్లు కలిసి మొత్తం 200 గుహలను జ్వాలాపురం వద్ద గుర్తించారు. వాటన్నింటిలోనూ చారిత్రక డ్రాయింగ్స్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద మొత్తంలో సమూహాలు నివసించేవని, రాళ్లతో తయారు చేసిన ఆయుధాలతో జింకలు, దుప్పులను వేటాడేవారని కోషి అంచనా వేశారు. ఈ పెయింటింగ్స్ 12 వేల ఏళ్ల నాటివని కోషి భావిస్తున్నారు. అలాగే మధ్య రాతియుగానికి చెందిన కళాఖండాలు కూడా ఇక్కడ బయటపడ్డాయి. ఓ గుహలో 2 వేలకుపైగా పెయింటింగ్స్ ఉన్నట్లు కోషి గుర్తించారు. ‘‘ఒకచోట నిటారుగా నిలబడిన ఓ కంగారూ ఉంది. ఇంకొన్ని బొమ్మలను పరిశీలిస్తే, అక్కడక్కడ కంగారూలు కనిపించాయి. చూస్తూ పోతే ‘కడుపులో బిడ్డను పెట్టుకున్న జంతువులు’ చాలా ఉన్నాయి’’ అని కోషి వివరించారు. కంగారూలు ఇండియాలో ఉండేవని కనుగొనడం ఇదే మొదటిసారని  భావిస్తున్నారు. ‘‘ఓ ఆర్కియాలజిస్టుగా, రాక్ ఆర్ట్ రీసెర్చర్ గా.. వేలాది వాల్ పెయింటింగ్స్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించడమంటే, గోల్డ్ మైన్‌ను కనుగొన్నట్లే. నిజంగా ఎల్ డొరాడోనే (బంగారు నగరం లేదా దేశం)” అని పాండిచ్చేరి యూనివర్సిటీ ప్రొఫెసర్ నవులూరి అన్నారు.