
అంటాల్యా: ఇండియా మెన్స్ రికర్వ్ టీమ్.. ఆర్చరీ వరల్డ్కప్ స్టేజ్–1లో గోల్డ్ మెడల్కు అడుగు దూరంలో నిలిచింది. గురువారం జరిగిన సెమీస్లో అటాను దాస్, ధీరజ్, తరుణ్దీప్ రాయ్తో కూడిన ఇండియా త్రయం 6–2తో నెదర్లాండ్స్ను ఓడించింది. దీంతో తొమ్మిది ఏళ్ల తర్వాత తొలిసారి ఇండియా టైటిల్ ఫైట్కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్లో నాలుగో ప్లేస్లో నిలిచిన ఇండియా టీమ్కు తొలి రౌండ్లో బై లభించింది. ప్రిక్వార్టర్స్లో 5–4తో 13వ సీడ్ జపాన్ను చిత్తు చేసింది.
హోరాహోరీగా సాగిన పోరులో ఇండియన్ ఆర్చర్లు మూడు ప్రయత్నాల్లో వరుసగా 10, 10, 9 పాయింట్లు నెగ్గడంతో ఇరుజట్ల స్కోరు 4–4తో సమమైంది. దీంతో విన్నర్ కోసం షూటాఫ్ నిర్వహించారు. ఇందులో ఇండియా 29–28 స్కోరుతో పైచేయి సాధించింది. ఇక క్వార్టర్ఫైనల్లో ఇండియా త్రయం 6–2తో 12వ సీడ్ చైనీస్ తైపీపై గెలిచింది. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్లో ఇండియా.. సెకండ్ సీడ్ చైనాతో తలపడుతుంది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో నెదర్లాండ్స్.. స్లొవేనియాను ఎదుర్కొంటుంది.
ఇక విమెన్స్ కాంపౌండ్ ఇండివిడ్యువల్ విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం సెమీస్లోకి ప్రవేశించింది. వరుసగా మూడు మ్యాచ్ల్లో 145 పాయింట్లు నెగ్గిన జ్యోతి.. మైరియామ్ హస్లెర్ (స్విట్జర్లాండ్ 137), డానెల్లి లుట్జ్ (అమెరికా 141), అనా సోఫియా (మెక్సికో 138)పై నెగ్గింది. క్వార్టర్ఫైనల్లో జ్యోతి 147–142తో గాలెంథియాన్ (డెన్మార్క్)ను ఓడించింది.