న్యూఢిల్లీ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ)లో అనిశ్చితి పూర్తిగా తొలిగింది. డబ్ల్యూఎఫ్ఐ పరిపాలన బాధ్యతలు చూసేందుకు ఏర్పాటు చేసిన అడ్ హాక్ కమిటీని రద్దు చేసినట్టు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) సోమవారం ప్రకటించింది. ఫెడరేషన్పై సస్పెన్షన్ను వరల్డ్ బాడీ ఎత్తివేయడంతో అడ్ హాక్ కమిటీని కొనసాగించాల్సిన అవసరం లేదని తెలిపింది. డబ్ల్యూఎఫ్ఐతో కలిసి అడ్హక్ ప్యానెల్ వచ్చే నెలలో జరిగే ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ కోసం సెలక్షన్ ట్రయల్స్ను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఓఏ తెలిపింది. దాంతో, డబ్ల్యూఎఫ్ఐ పూర్తి బాధ్యతలు ఎన్నికల్లో గెలిచిన ప్రెసిడెంట్ సంజయ్ సింగ్ నేతృత్వంలోని కొత్త పాలకవర్గమే చూసుకోనుంది.
