చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలె

 చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలె

కేసీఆర్ కు దేశ రాజకీయాలు చేసే సత్తా లేదని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్థంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. గూట్లో రాయి తీయలేనివాడు  ఏట్లో రాయితీస్తాడా? అని ఈటల ఈ సందర్భంగా కొన్ని సెటైరికల్ కామెంట్స్ చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయిన కేసీఆర్, దేశ ప్రజల నమ్మకాన్ని కూడగడతాడా? అని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు కేసీఆర్ ను ఒక బఫూన్ లా చూస్తున్నారన్న ఈటల... ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. 

గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం తిని విద్యార్థులు చనిపోతున్న పరిస్థితి ఉందని ఈటల రాజేందర్ అన్నారు. కరప్షన్ కు మారుపేరు కేసీఆర్, కుటుంబ పాలనకు మారుపేరు కేసీఆర్ అని ఈటల దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కు దేశ రాజకీయాలు చేసే సత్తా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చెల్లని రూపాయిగా మారిన కేసీఆర్ దేశంలో ఏం చెల్లుతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సర్పంచ్ లకు బిల్లులు రావాలంటే టీఆర్ఎస్ పార్టీలో చేరాలని టీఆర్ఎస్ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు. హుజూరాబాద్ లో ప్రజలు ఏ తీర్పుపై ఇచ్చారో మునుగోడులోనూ అదే తీర్పు పునరావృతం అవుతుందని ఈటల జోస్యం చెప్పారు. బై ఎలక్షన్స్ ఉంటేనే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకి వస్తాడన్నారు.