- పాత డీపీఆర్ ప్రకారం ఎల్లంపల్లిలోనే కలపాలి
- మంచిర్యాలలో వామపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకుల సమావేశం
మంచిర్యాల, వెలుగు : ‘ప్రాణహిత ప్రాజెక్టుకు, సుందిళ్ల బ్యారేజీకి లింక్ చేయడం భవిష్యత్లో చాలా ప్రమాదకరం, ఆ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి’ అని వామపక్ష ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.శ్రీనివాస్ అధ్యక్షతన ఆదివారం మంచిర్యాలలో నిర్వహించిన మీటింగ్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణ శంకర్, తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్, సీపీఎం రాష్ట్ర నాయకుడు సంకె రవి, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ గత ఎన్నికల ముందు కుంగిపోయిందని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు బుంగలు ఏర్పడి వాటి మనుగడ సైతం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పి.చంద్రఘోష్ కమిషన్తో విచారణ చేయించి ఆ నివేదికను అసెంబ్లీ తీర్మానం సాక్షిగా సీబీఐకి అందజేసిందని అన్నారు. సుందిళ్ల బ్యారేజీ గురించి జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ) కూడా ఆందోళన వ్యక్తం చేసిందన్నారు.
అలాంటి సుందిళ్ల బ్యారేజీకి తుమ్మిడిహెట్టి నుంచి ప్రతి ఏటా 80 టీఎంసీల నీటిని తరలించడం మరో కాళేశ్వరం వంటి విపత్తుకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ ప్రపోజల్ను విరమించుకోవాలని, పాత డీపీఆర్ ప్రకారం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ప్రాణహితను లింక్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. సమావేశంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు విశ్వనాథ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి బాబన్న, సీఐటీయూ జిల్లా కార్యదర్శి మేకల దాసు, తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా నాయకుడు జైపాల్సింగ్, న్యూడెమోక్రసీ నాయకుడు భీమన్న పాల్గొన్నారు.
