ముంబై: ఇండియా క్రీడారంగం సరికొత్త ఆర్థిక శిఖరాన్ని అధిరోహించింది. దేశీయ స్పోర్ట్స్ ఎకానమీ తొలిసారిగా 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.18,864 కోట్లు) మార్కును దాటినట్లు డబ్ల్యూపీపీ మీడియా సంస్థ విడుదల చేసిన ‘స్పోర్టింగ్ నేషన్: బిల్డింగ్ ఏ లెగసీ’ 13వ ఎడిషన్ నివేదిక వెల్లడించింది. 2024తో పోలిస్తే ఇది 13.4 శాతం వృద్ధిని నమోదు చేసింది.
గత నాలుగేండ్లలోనే స్పోర్ట్స్ ఇండస్ట్రీ దాదాపు డబుల్ అవ్వడం విశేషం. ఈ మొత్తం ఆదాయంలో క్రికెట్ వాటా ఏకంగా 89 శాతం (రూ16,704 కోట్లు) ఉండటం గమనార్హం. గతేడాది ఇది 85 శాతంగా ఉండగా, ఇప్పుడు మరింత బలపడింది. ప్రస్తుతం కేవలం క్రికెట్ ద్వారా వస్తున్న ఆదాయమే 2024 నాటి మొత్తం ఇండియా స్పోర్ట్స్ ఎకానమీ (రూ.16,633 కోట్లు) కంటే ఎక్కువ.
ఐపీఎల్ సక్సెస్తో పాటు చాంపియన్స్ ట్రోఫీ, విమెన్స్ వరల్డ్ కప్ నెగ్గడం ఈ పెరుగుదలకు కారణమైంది. మొత్తం క్రీడా ఆదాయంలో మీడియా ఖర్చులు 51 శాతం వాటాను కలిగి ఉన్నాయి. టీవీ ప్రకటనలు 16.4 శాతం పెరగ్గా, డిజిటల్ ప్రకటనలు 24 శాతం వేగంతో దూసుకుపోతున్నాయి.
ఆటగాళ్ల బ్రాండ్ ఎండార్స్మెంట్ల విలువ రూ.1,350 కోట్లకు చేరింది. అందులో 87 శాతం వాటా క్రికెటర్లదే. సోషల్ మీడియా మెన్షన్స్లో విరాట్ కోహ్లీ (1.07 కోట్లు), రోహిత్ శర్మ (1.03 కోట్లు) టాప్లో ఉండగా, ఇతర క్రీడల్లో నీరజ్ చోప్రా (4.45 లక్షలు) మాత్రమే గట్టి పోటీని ఇస్తున్నాడు.
