
- గ్లోబల్గా పెరుగుతున్న అనిశ్చితి
- ఫండ్స్ విత్డ్రా చేసుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లు
- ఎనర్జీ, ఫైనాన్స్, ఐటీ షేర్లలో పెరిగిన అమ్మకాలు
- 24,550 దిగువకు నిఫ్టీ
న్యూఢిల్లీ: ఇండియన్ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో సెషన్లోనూ నష్టపోయింది. గ్లోబల్ మార్కెట్స్ నష్టాల్లో కదలడం, స్టాక్స్ వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయనే ఆందోళనలు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు మార్కెట్ నుంచి వెళ్లిపోతుండడంతో బెంచ్మార్క్ ఇండెక్స్లు మంగళవారం సుమారు ఒక శాతం పతనమయ్యాయి. ఈ వోలటాలిటీ సెషన్ను సెన్సెక్స్ 636పాయింట్లు (0.78 శాతం) లాస్తో 80,738 దగ్గర ముగించింది. ఇంట్రాడేలో దాదాపు 800 పాయింట్లు పతనమై (ఒక శాతం) పడిపోయి 80,575.09 కి చేరింది. నిఫ్టీ 50 కూడా ఇంట్రాడేలో 24,502.15 వరకు పడింది. చివరికి 174 పాయింట్లు నష్టంతో 24,543 వద్ద సెటిలయ్యింది. బీఎస్ఈలో 2,266 షేర్లు నష్టపోగా, ఇందులో 1,731 షేర్లు లాభాల్లో ముగిశాయి.
బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.52 శాతం, స్మాల్క్యాప్ 0.07 శాతం పడ్డాయి. ఈ ఒక్క రోజులో ఇన్వెస్టర్లు రూ.2.50 లక్షల కోట్లు లాస్ అయ్యారు. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.445.50 లక్షల కోట్ల నుంచి 443 లక్షల కోట్లకు పడిపోయింది. ‘‘ ఆర్బీఐ పాలసీ నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. నిఫ్టీకి 24,500 వద్ద షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంది. ఈ లెవల్ కంటే కిందకి వెళ్తే అమ్మకాలు పెరిగి, 24,000కి పడిపోవచ్చు. 24,500 పైన ఉంటే, నిఫ్టీ 24,700–24,750 వరకు రికవర్ అవుతుంది” అని ఎల్కేపీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ రూపక్ డే పేర్కొన్నారు.
మార్కెట్ పతనానికి 5 ప్రధాన కారణాలు.. వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉండడం..
నిఫ్టీ 50 పీఈ (ప్రైస్టుఎర్న్) రేషియో దాని ఒక ఏడాది సగటు కంటే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బ్రాడ్ మార్కెట్ హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి. “మార్కెట్లో హై వాల్యుయేషన్స్ గురించి టెన్షన్ ఉంది. కానీ, మార్కెట్లోకి ఫండ్స్ వస్తుండడం, రిటైల్ ఇన్వెస్టర్లు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తుండడం చూస్తే ఇండియన్ స్టాక్స్ ఇంకొంత కాలం హై వాల్యుయేషన్స్లోనే ఉంటాయి” అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు.
యూఎస్ ట్రేడ్ పాలసీ అనిశ్చితి..
ఇండియా, యూఎస్ మధ్య ట్రేడ్ డీల్ త్వరగా కుదురుతుందని మార్కెట్ అంచనావేసింది. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదరడంలో ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. యూఎస్ ట్రేడ్ పాలసీలు గందరగోళంగా మారాయి. ట్రంప్ టారిఫ్ ప్లాన్స్పై క్లారిటీ లేదు. యూఎస్ ట్రేడ్ డీల్ బ్రేక్ చేసిందని చైనా చెప్తోంది. ట్రంప్, చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్తో మాట్లాడి ఈ గొడవను సెటిల్ చేయాలని చూస్తున్నారు.
ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు వెళ్లిపోవడం..
ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) గత రెండు సెషన్స్లో నికరంగా రూ.9 వేల కోట్లను మార్కెట్ నుంచి విత్డ్రా చేసుకున్నారు. యూఎస్ బాండ్ యీల్డ్స్ పెరగడం, ఇండియన్ స్టాక్స్ హై వాల్యుయేషన్స్ ఉండడం వలన మార్కెట్లో నికర అమ్మకందారులుగా మారారు. “ఎఫ్పీఐ సెల్లింగ్, జియోపొలిటికల్ టెన్షన్స్, ట్రేడ్ డీల్స్ అనిశ్చితి లాంటి గ్లోబల్ అంశాలతో మార్కెట్పై ఒత్తిడి పెరుగుతోంది” అని రెలిగేర్ బ్రోకింగ్ అజిత్ మిశ్రా చెప్పారు.
కొత్త ఈవెంట్స్ లేకపోవడం..
లోకల్ మార్కెట్లో కొత్త పాజిటివ్ న్యూస్ లేదు. ఈ ఏడాది మార్చి క్వార్టర్ రిజల్ట్స్ ఓకే అనిపించాయి. కానీ మార్కెట్ సెంటిమెంట్ మాత్రం పెద్దగా మెరుగవ్వలేదు. “మార్చి క్వార్టర్ రిజల్ట్స్ అంచనాల కంటే బెటర్గా ఉన్నాయి. కానీ కంపెనీల ఫ్యూచర్ ఎర్నింగ్స్ గైడెన్స్ బలహీనంగా ఉన్నాయి” అని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. ఇండియా గ్రోత్ బాగుంది, కానీ మార్కెట్ ఇప్పటికే దీనికి అనుగుణంగా పెరిగింది. ఇప్పుడు అందరూ జూన్ 6న వెలువడే ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అంచనా వేసినట్టు ఆర్బీఐ రేట్ల కోత ఉంటే మార్కెట్ పెద్దగా పెరగకపోవచ్చు.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం..
ఉక్రెయిన్ తాజాగా రష్యా ఎయిర్ఫీల్డ్స్పై అటాక్స్ చేయడంతో ఇరు దేశాల మధ్య టెన్షన్స్ పెరిగాయి. ఉక్రెయిన్ వార్ 3 ఏళ్లకు పైగా నడుస్తోంది. ఇన్ఫ్లేషన్, ఎనర్జీ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ బాగా ప్రభావితమయ్యాయి. ఇప్పుడు మార్కెట్స్ కాస్త సెటిల్ అయ్యాయి. కానీ ఈ యుద్ధ ప్రభావం ఇంకా ఉంది. సీజ్ఫైర్ చర్చలు మొదలయ్యాయి. మార్కెట్స్ ఈ అంశాలను ఫాలో అవుతున్నాయి” అని వీటీ మార్కెట్స్ ఎనలిస్ట్ రాస్ మాక్స్వెల్ అన్నారు.